ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వివాదం మళ్లీ మంటలు రేపుతోంది. ఈ సారి స్పాట్‌లైట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల సినిమా ఓజీ. సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేట్లు ఏకంగా రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా పెంచడంపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చి టికెట్ ధరలను రూ.800 వరకూ పెంచే అవకాశం కల్పించింది. ఆ నిర్ణయాన్ని అభిమానులు, సినీ ఇండస్ట్రీ సంతోషంగా స్వాగతించాయి. బన్నీ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ నిర్ణయానికి న్యాయం జరిగిందని అప్పట్లో చెప్పుకున్నారు.


కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకు అంతకంటే ఎక్కువగా రూ.1000 వసూలు చేయడాన్ని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. “పుష్ప 2” లాంటి భారీ బడ్జెట్ మూవీకి రూ.800 రేటు పెంచితే, తక్కువ బడ్జెట్ ఉన్న “ఓజీ”కి వెయ్యి రూపాయలు పెట్టడం ఎలా న్యాయం అవుతుంది?” అంటూ వైసీపీ సోషల్ మీడియా యోధులు నిలదీస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటైన కౌంటర్ ఇస్తున్నారు. “అప్పుడు పుష్ప 2కు రూ.800 పెంచినప్పుడు మీరు నోరు మెదపలేదే! ఇప్పుడు అదే లాజిక్ ప్రకారం ఓజీకి వెయ్యి పెట్టడంలో తప్పేం లేదు. ఇది సినిమా క్రేజ్‌కి తగిన రేటే” అంటూ వాదిస్తున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా వాడుకుని వ్యక్తిగత లాభం కోసం రేట్లు పెంచుకుంటున్నారన్న వైసీపీ ఆరోపణలను ఫ్యాన్స్ తోసిపుచ్చుతున్నారు.



ఇక ఈ వివాదం కేవలం టికెట్లకే పరిమితం కాకుండా రాజకీయ వర్గాల మధ్య కూడా “ఢీ అంటే ఢీ”గా మారింది. ఒకవైపు పవన్ అభిమానులు తమ హీరో ఇమేజ్, క్రేజ్‌ను కాపాడుతుంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు రాజకీయ కోణంలోనే దాడులు చేస్తున్నారు. ఈ రగడను చూస్తున్న సామాన్య ప్రేక్షకులు మాత్రం “ఇంత ఖరీదైన టికెట్లు ఎవరు కొనగలరు?” అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి.. పుష్ప 2 వర్సెస్ ఓజీ టికెట్ రేట్ల యుద్ధం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. ఇది చివరికి ఎవరి ఇమేజ్‌కు ఉపయోగపడుతుందో చూడాలి కానీ, ఖరీదైన టికెట్ల భారం మాత్రం ప్రేక్షకులపై పడటం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: