- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇటీవ‌ల‌గా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబినేష‌న్‌పై ఉన్న అంచ‌నాలు మరింత పెరిగేలా ఓ కీల‌క విష‌యం బయట‌కు వ‌చ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు “వారణాసి” అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే కాన్సెప్ట్ వీడియో, మ‌హేష్ బాబు ఫ‌స్ట్ లుక్, ప్రియాంకా చోప్రా పోస్ట్‌ర్లు సునామీలా సోషల్ మీడియాను క‌వ‌ర్ చేశాయి. అయితే వాటితో పోలిస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ మాత్రం కొంత మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. సాధార‌ణంగా రాజ‌మౌళి చిత్రాల్లో విల‌న్ల‌కు ప్రత్యేక హైలైట్ ఉంటుంది. బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాల్లో విభిన్నంగా రూపొందించిన ప్రతి నాయకులే క‌థ‌కు బల‌మై ఉంటారు. కానీ పృథ్వీరాజ్ లుక్ మాత్రం మొద‌ట చూసిన వారికి పెద్ద‌గా ఇంపాక్ట్ ఇవ్వ‌లేద‌నే అభిప్రాయం వ‌చ్చింది.


అయితే దీనికి సంబంధించిన థియరీలు కొద్ది రోజులుగా నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ పాత్ర‌కు “కుంభా” అనే పేరు పెట్టడమే పెద్ద చర్చకు తెరలేపింది. ఇది సాధారణ పేరు కాదని, రామాయణంలోని శక్తివంతమైన పాత్ర కుంభకర్ణుడు నుండి తీసుకున్న స్ఫూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. ఆరు నెలలు నిద్రించి, ఆరు నెలలు మేల్కొని ఉండే అతడి వ్యక్తిత్వం ఎంతో విశిష్టం. రామ - రావణ యుద్ధంలో కుంభకర్ణుడు రాముడికి సవాలుగా ఎదిరించే సన్నివేశాలు ఇప్పటికీ పురాణాల్లో ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడిదే పోలిక‌ పృథ్వీరాజ్ లుక్‌లో కనిపిస్తోంది. చక్రాల కుర్చీకి పరిమితమై, చేతులు - కాళ్లు బలహీనంగా చూపించబడిన కుంభా క్యారెక్టర్, కుంభకర్ణుడు యుద్ధంలో కోల్పోయిన అవయవాలకు ప్రతీకగా భావిస్తున్నారు.


అంతేకాక రాజ‌మౌళి ఈ క‌థ‌కు రామాయ‌ణం ప్రేరణగా ఉందని, మ‌హేష్ బాబు ఇందులో రాముడి లక్షణాలతో కనిపిస్తాడని చెప్పిన నేపథ్యంలో, హీరో - విలన్ మధ్య పురాణ శైలిలో క్లైమాక్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి, మొద‌టిసారి కనబడినంత సరళమైన పాత్ర కాదు కుంభా. కుంభకర్ణుడి శక్తి, పురాణ గాథ, ఆధునిక రూపకం అన్నీ కలిసిన అతి ప్రత్యేక ప్రతినాయకుడిగా ఈ క్యారెక్టర్‌ను రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడన్న అంచనాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: