తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎన్నో సంవత్సరాలుగా అపారమైన ఆనందాన్ని పంచిన సీరియల్స్‌ జాబితాలో ‘అమృతం’ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా 90లలో పెరిగిన పిల్లలకు ఈ సీరియల్ అంటే పరమానందం, ఓ ప్రత్యేకమైన నోస్టాల్జియా. వారి చిన్ననాటి నవ్వులను, కుటుంబంతో గడిపిన చిరస్మరణీయ క్షణాలను గుర్తుకు తెచ్చే ఈ సీరియల్‌ మళ్లీ ఒకసారి ప్రేక్షకుల ముందుకు రానుండటం నిజంగా ప్రతి ఒక్కరినీ ఉత్సాహంతో నింపుతోంది. తెలుగు టెలివిజన్‌ చరిత్రలో క్లాసిక్ కామెడీగా, ఎప్పటికీ నిలిచిపోయే స్థాయి గుర్తింపును పొందిన ‘అమృతం’ సీరియల్‌ ఈ సంవత్సరం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, నేటి కొత్త తరానికి కూడా ఆ స్వచ్ఛమైన హాస్యాన్ని చేరవేయాలన్న ఉద్దేశంతో సీరియల్‌ టీమ్‌ ప్రత్యేకంగా రీమాస్టర్ చేసిన కొత్త వెర్షన్‌ను విడుదలకు సిద్ధం చేసింది.


పాత ఎపిసోడ్‌లను ఆధునిక సాంకేతికతతో మరింత శుభ్రమైన విజువల్స్‌తో, మెరుగైన కలర్‌ గ్రేడింగ్‌తో, స్పష్టమైన ఆడియోతో నూతన రూపంలో తీర్చిదిద్దారు. ఈ రీమాస్టర్‌డ్ ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో తిరిగి పాత జ్ఞాపకాల్ని మేల్కొల్పడంతోపాటు, కొత్త తరం యువతలో కూడా అమృతం స్టైల్ హాస్యం ఎలా ఉంటుందో చూపిస్తాయని మేకర్స్‌ విశ్వసిస్తున్నారు. ఈసారి యూట్యూబ్‌నే వేదికగా తీసుకుని, ఆమ్రుథం ప్రత్యేక ఛానల్‌ ద్వారా పూర్తిగా డిజిటల్ తరహాలో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నవంబర్‌ 24 నుంచి ప్రతి రోజూ రెండు ఎపిసోడ్‌లు వరుసగా విడుదల చేయనున్నట్లు టీమ్‌ అధికారికంగా ప్రకటించింది.



దీంతో ఒకప్పటి టీవీ కాలంలో కుటుంబమంతా కలిసి చూసిన ఆ అమృతమైన నవ్వులు… ఇప్పుడు డిజిటల్‌ కాలంలో కూడా అదే ఉత్సాహంతో ప్రేక్షకులకు అందుతాయన్న నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పాతవారికి నెమరుల పండుగగా, కొత్తవారికి అసలు హాస్యం అంటే ఏమిటో చూపించే పాఠంలా ‘అమృతం’ రీమాస్టర్‌డ్ వెర్షన్‌ నిలిచిపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన సరే దీని గురించే మాట్లాడుకుంటూన్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: