విద్యా వ్య‌వస్థ‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తున్న‌ద‌ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ ఆరోపించారు. సోషల్ వెల్పేర్ స్కాలర్ షిప్ తో నేను విద్యాభ్యాసం పూర్తి చేశాన‌ని గుర్తు చేసుకున్నారు. మొదట రూ18.69 పైసలు తీసుకున్నానని తెలిపారు. 1974 వ సంవ‌త్స‌రంలో స్కాలర్ షిప్ కోసం ఉద్యమం చేశామ‌ని గుర్త చేశారు. ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ కోసం 15 సార్లు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కలిశాను అని పేర్కొన్నారు చింతా మోహ‌న్‌.


గత రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌భుత్వం ఫీజు రిఎంబర్స్ మెంట్ చేయడం లేదు అని ఆరోపించారు. ప్ర‌స్తుతం చ‌దువుకుంటున్న 80 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ రాక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఆంద్ర‌ప్ర‌దేశ్ పక్కన ఉన్న‌ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



 కాలేజీలు తెరిస్తారు మ‌రి విద్యార్థుల  ఫీజులు ఎవ్వరు చెల్లించాలి అని ప్ర‌శ్నించారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్‌.  విద్యార్థుల‌కు స్కాలర్ షిప్ లు ఆపడం దారుణం అని ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.  వైసీపీ ప్రభుత్వం ఏ పథకం కోసం స్కాల‌ర్ షిప్ నిధుల‌ను  దారి మళ్లించారో తెలపాలి అని ప్ర‌శ్నించారు. యూనివర్సిటీల‌ల్లో ఎందుకు తరగతులు నిర్వహించడం లేదు అని ఈ సంద‌ర్భంగా ప్రభుత్వాన్ని నిల‌దీశారు.


 విద్య వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ విధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది అని ఆరోపించారు. దీపావళి లోపు విద్యార్థుల స్కాలర్ షిప్ లు చెల్లించాలి అని చింతా మోహ‌న్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దీపావ‌ళి లోపు స్కాల‌ర్ షిప్‌లు చెల్లించి విద్యార్థుల‌కు సాయం చేయాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: