ఇవాళ శ్రీకాకుళం యువ ఎంపీ పుట్టిన రోజు. నాన్న ఎర్రన్నాయుడి వారసత్వం అందుకుని, బాబాయ్ అచ్చెన్నాయుడు (తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు) నిర్దేశకత్వంలో పనిచేస్తూ ఓ గొప్ప స్టార్ డమ్ ఉన్న నేతగా ఎదిగారు. పార్టీ ఉన్నతికి కృషి చేస్తూ వివాదరహితులుగా ఉన్నారు. ఆయన చిన్న వయసులోనే ఇటుగా వచ్చినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకుని, అధ్యయనం చేసి ప్రజల తరఫున వాటిపై పోరాడడంలో నాన్నకు మించి పేరు తెచ్చుకున్నారు అన్నది అతిశయం కాదు.
ఇంకా చెప్పాలంటే.....
అనతి కాలంలోనే ఆంధ్రావని రాజకీయాల్లోనే కాక దేశం యావత్తూ గర్వించే స్థాయికి ఎదిగిన నేత ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నది టీడీపీ ఇవాళ కీర్తిస్తున్న మాట. చిన్న వయస్సులోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణిస్తూ, రాష్ట్ర సమస్యలపై ఎప్పటిక ప్పుడు పోరాడే ఏకైక నేతగా ఆయనకు మంచి పేరుంది. ప్రత్యేక జోన్ గురించి మాట్లాడినా, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినా మంచి నాయకుడిగా వాగ్ధార ఉన్న నాయకుడిగా ఇవాళ రామూ ఇమేజ్ కు తిరుగే లేదు. అవును! శ్రీకాకుళం సమస్యలపై ఇక్కడి వెనుకబాటుతనంపై ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో ప్రశ్నాస్త్రాలు సంధించి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు. అదేకాదు చాలా విషయాల్లో పూర్తి పరిపక్వతతో ఆయన మాట్లాడే తీరు, అనర్గళంగా వివరించే తీరు అన్నవి శ్రీకాకుళం నాయకులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నాయకులనూ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 18) ఆయన పుట్టిన రోజు.
ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు ఏమన్నారంటే...
తెలుగుదేశం యువనేత, పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు కింజరాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక ఎంపీగా జాతీయ స్థాయిలో రాష్ట్ర సమస్యలను చర్చకు తెచ్చేందుకు మీరు చూపుతున్న చొరవ, శ్రద్ధ ప్రశంసనీయం. మీరు ఇలాంటి మరె న్నో పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలని... నిండు నూరేళ్లూ మీరు ఆనంద ఆరోగ్యాలతో, కీర్తి సంపదలతో వర్థిల్లాలని హృద య పూర్వకంగా కోరుకుంటున్నాను. అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.