అధికారం ఎవ్వరిది అయినా దక్కే ఫలాలు మాత్రం నాయకులకు సమానంగానే అందుతూ ఉంటాయి. అందుకు ఉదాహరణలు ఎన్నో! అధికారం ఎవ్వరిది అయినా అందుకు తగ్గ వాటాలు ఆ పార్టీ ఈ పార్టీ సర్దుకున్నాకే నీతులు మరియు సూత్రాలు అన్నవి వల్లింపునకు నోచుకుంటాయి. ఇదే ఇవాళ్టి పరమ సత్యం. ఈ పరమ సత్యం కారణంగా యనమల సేఫ్. ఈ పరమ సత్యం కారణంగాఇంకా చాలా మంది ఉత్తరాంధ్ర నాయకులు సేఫ్. ఏం కాదు పరమ సత్యం అమలులో ఉన్నంత కాలం ఆ పార్టీ ఈ పార్టీ
మధ్య మాటల భేదం తప్ప లౌక్యం పాటింపులో ఎటువంటి తేడా అన్నది కనిపించదు. (కానరాదు)
ఏపీ మంత్రులతో టీడీపీలో కీలకంగా ఉన్న నేతలు కొందరు రహస్య మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందుకు చాలా దారులను ఎంచుకుని ఉన్నారని కూడా సమాచారం. వాస్తవానికి ఈ ప్రభుత్వంలో టీడీపీ నాయకుల హవా పెద్దగా నడవలేదు అని అనుకోలేం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు (ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులు) తమ మాటను ఎలా నెగ్గించుకున్నారో రెవెన్యూ యంత్రాంగాన్ని ఎలా దార్లోకి తెచ్చుకుని తమ పనులు ఎలా చేయించుకున్నారో అందరికీ తెలిసిందే! ఇప్పుడు అదే పంథాంలో టీడీపీ నేతలు కొందరు వైసీపీ పెద్దలతో దగ్గరగానే ఉంటున్నారు. జగన్ ప్రస్తుతానికి ఎవ్వరికీ పార్టీలో చేరే అవకాశం ఇవ్వడం లేదు కనుక వీరంతా తమ లాబీయింగ్ ను మాత్రం బాగానే నడుపుతున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల వైసీపీ హవాలో టీడీపీ పనులు ఎంతో బాగా నడుస్తున్నాయి.
ముఖ్యంగా ఆ రోజు ఇసుక ర్యాంపుల విషయమై ఈ రెండు పార్టీలూ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అదే తంతు ఇప్పుడు కూడా చాలా చోట్ల రిపీట్ అవుతోంది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి చెందిన లీడర్లు వైసీపీకి పరోక్షంగా ఎంతో సాయం చేశారు.ఆ సాయం ఫలితంగానే వైసీపీ చాలా చోట్ల నిలదొక్కుకుంది కూడా! ఇప్పుడు ఆ సాయంకు ప్రతిఫలంగా టీడీపీ వర్గీయులకు ఇసుక ర్యాంపులలోనో లేదా మరో రూపంలోనో వాటాలు దక్కడం ఖాయంగానే ఉంది.