కరోనా ఇప్పుడు దేశమంతా మరోసారి వ్యాపిస్తోంది. ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా దేశమంతా కేసుు పెరుగుతున్నాయి. తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేగింది. స్వయంగా సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, ఇద్దరు పిల్లలకు కొవిడ్ వచ్చింది. అంతే కాదు.. సీఎం నివాస ప్రాంగణంలో 15 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. సీఎం నివాస ప్రాంగణంలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించగా..హేమంత్ సోరెన్ నివాసంలోని మొత్తం 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


మొత్తం అందరికీ పరీక్షలు నిర్వహించగా.. సీఎం భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 15 మందికి కరోనా ఉన్నట్టు నిర్థరణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. అయితే.. ఎవరికీ పెద్దగా అనారోగ్యం లేదని.. కొద్దిపాటు జలుబు మాత్రమే ఉందని సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వీరందరినీ ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కరోనా నిర్థరణ అయినందువల్ల సీఎం హేమంత్‌ సొరేన్ ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు.


ముఖ్యమైన సమీక్షలను వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నారు. కరోనా మూడోవేవ్‌ ఉధృతి ప్రభావం ప్రముఖులపైనా ఉంది. నిన్ననే డిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు పెద్దగా లక్షణాలు లేవని.. మొదటి రెండు రోజులు కొద్దిగా జ్వరం వచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. మూడోవేవ్‌ గురించి ఆందోళన అవసరం లేదని.. కానీ.. అప్రమత్తత అవసరమని కోవిడ్‌ నుంచి కోలుకున్నాక నిర్వహించిన మీడియా సమావేసంలో కేజ్రీవాల్ తెలిపారు.


కరోనా సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే.. థర్డ్‌ వేవ్‌లో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని.. ఆస్పత్రుల పాలవడం కూడా చాలా తక్కువగా ఉందని కేజ్రీవాల్ లెక్కలతో సహా వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే కొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: