ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి వచ్చిన మంత్రి రోజా.. ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బాక్సులు బద్దలవుతాయని అన్నారు. జగన్ ని వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అని, అలాంటి వారందరి బాక్సులు బద్దలయ్యేలా ప్రజలు తీర్పునిస్తారని చెప్పారు. ఆత్మకూరులో అధికార పార్టీకి లక్ష మెజార్టీ ఖాయమని అంటున్నారు రోజా.

మంత్రి రోజా ఆత్మకూరులో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె చేజర్ల మండలానికి ఇన్ చార్జి గా వచ్చారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆమె చుట్టేస్తున్నారు. మండల పరిధిలోనే ఆమె రాత్రి పూట బస చేస్తున్నారు. ఉదయాన్నే తిరిగి ప్రచారం మొదలు పెడుతున్నారు. మొత్తమ్మీద సీఎం జగన్ తనకు అప్పగించిన పనిని ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నారు రోజా.

టీడీపీ హయాంలో కేవలం ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే జన్మభూమి కమిటీలు లబ్ధి చేకూర్చేవని, వారికి సంబంధించిన వారికే పింఛన్లు ఇచ్చేవారని, మిగతా వారికి సంక్షేమ పథకాలుఅమలయ్యేవి కావని చెప్పారు. వైసీపీ హయాంలో అందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయని, పార్టీలని చూసుకోకుండా తాము పనిచేస్తున్నామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజలు ముందుకే సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వాలంటీర్లతో పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నామని అన్నారు రోజా.

సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు రోజా. ఇప్పటి వరకూ లక్షా 40వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల పేరుతో నేరుగా ప్రజలకు అందజేశామని చెప్పారు. లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని, వైసీపీని వారంతా ఆదరిస్తారని ధీమాగా చెప్పారు. 2024లో ఎవరెన్ని కూటములు కట్టి వచ్చినా జగన్ సింగిల్ గా విజయం సాధిస్తారని చెప్పారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: