పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు మీడియాతో తమ వ్యూహాల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ ఎంపీలు కూడా ఇదే అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్ ‌సీపీ  లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పిన ఓ డైలాగ్ వింటే నవ్వు రాక మానదు. అదేంటంటే.. నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై  పార్లమెంట్‌లో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మిథున్ రెడ్డి అంటున్నారు.


అంతే కాదు..అవకాశం వచ్చినా ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని మిథున్ రెడ్డి  తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్‌ ఎడ్వైజరీ కమిటీ భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైయ‌స్ఆర్ ‌సీపీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.   భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌ కోరినట్లు తెలిపారు.


అదే సమయంలో మిథున్ రెడ్డి ప్రత్యేక హోదాపై ఈ డైలాగ్ కొట్టారు. ప్రత్యేక హోదా అనేది చివరకు జనం కూడా మర్చిపోయే అంశంగా మారింది. అది ఎవరూ సాధించలేరన్న సంగతి ప్రజలకు కూడా అర్థమైంది. ఒకవేళ సాధించే అవకాశం ఏమైనా ఉంటే.. అది మళ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే. అప్పటి వరకూ వైసీపీ నేతలు ప్రత్యేక హోదా అనే అంశంపై స్పందించకపోవడం మంచిది. వారు ఏమైనా మాట్లాడినా అది కామెడీగానే అనిపిస్తుంది.  


ఇంకా మిధున్ రెడ్డి ఏమన్నారంటే.. " ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుంది.  విపక్షాలకు అంశాలు లేక తమపై అనవసరమైన నిందలు వేస్తున్నాయి. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఎవరు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.." అన్నారు మిథున్ రెడ్డి.  

మరింత సమాచారం తెలుసుకోండి: