కలకత్తా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అందులోనూ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఆ పార్టీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మింగుడు పడడం లేదు. దీనికి తోడు ఇటీవల ఆ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. అసలు టీఎంసీ పార్టీలో ఏం జరుగుతుందోనంటూ సర్వత్రా చర్చ మొదలైంది.
టీఎంసీ సీనియర్ మంత్రి సివేందు అధికారి తన మంత్రి పదవికి నేడు రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. మరో కాపీని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు పంపారు. రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సివేందు తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. టీఎంసీ ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగనున్నారు.
 అయితే సివేందు రాజీనామాతో సీఎం మమతకు షాక్ తగిలినంత పనైంది. అంతేకాకుండా ఆయన త్వరలోనే పార్టీ కూడా వీడే అవకాశం ఉందని పుకార్లు వస్తుండడంతో తరువాతి పరిణామాలపై మమత సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. 
నందిగ్రామ్ ఎమ్మెల్యే అయిన సివేందు కొన్ని నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుంన్నారు. పార్టీ, కేబినెట్ 
సమావేశాలకూ డుమ్మా కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నిర్వహించిన ర్యాలీల్లో కూడా సీఎం మమత ఫోటోలు కానీ, టీఎంసీ జెండాలు, బ్యానర్లు కానీ కనిపించడం లేదు. మమత బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో 
ప్రాముఖ్యం దక్కడమే సివేందు అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఆయన ఎన్నడూ బహిరంగంగా మాట్లాడలేదు.
సివేందు రాజీనామాపై తృణమూల్ సీనియర్ నేత, ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడుతూ, ఆయన మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశారని, ఎమ్మెల్యే పదవికి కానీ, పార్టీకి కానీ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఆయనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని, ఏమైనా ఇబ్బందులుంటే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు.
 అయితే రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తానేమీ పారాచుట్ వేసుకునో, లిఫ్ట్ ఎక్కో ఈ స్థాయికి రాలేదని, ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ ఎంతో కష్టపడి చేరుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు మమత మేనల్లుడిని దృష్టిలో ఉంచుకుని అన్న వ్యాఖ్యలుగానే కనిసిస్తుండడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. మరి ఈ సమస్యను ముఖ్యమంత్రి ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: