వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, ఆపై రాజమండ్రి జైలుకు తరలింపు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసినప్పటికీ, మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. పక్కా ఆధారాలు ఉండబట్టే అధికారులు ఈ అరెస్టు చేశారని చెబుతున్నారు. మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంటారు. ఈ పరిణామాలపై వైసీపీ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పార్టీలో జగన్ టీమ్‌గా లేదా జగన్ పదవులు ఇచ్చిన వారు మాత్రమే స్పందించారు. తటస్థంగా ఉన్న నాయకులు పెద్దగా స్పందించలేదు. ఇది పార్టీలో అంతర్గత సమన్వయం లేమిని సూచిస్తుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ కీలక నేత అరెస్టు అయినప్పుడు పార్టీలో విస్తృత మద్దతు లభించకపోవడం వైసీపీకి ప్రతికూల అంశం అని చెప్పాలి.


రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం :
మిథున్ రెడ్డి అరెస్టును రెడ్డి సామాజిక వర్గంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా, లేదా చంద్రబాబు రెడ్డి సామాజిక వర్గాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీలోని ఓ వర్గం నాయకులు ఆరోపించినా, అది రెడ్డి సామాజిక వర్గంపై పెద్దగా ప్రభావం చూపలేదు. రెడ్డి సామాజిక వర్గం దీనిని తమపై జరిగిన దాడిగా లేదా తమ వర్గాన్ని అణచివేసే ప్రయత్నంగా భావించడం లేదు. వారు ఈ కేసును కేవలం ఒక కేసుగానే చూస్తున్నారు. అంటే, వైసీపీ ఆశించినట్టుగా రెడ్ల పోలరైజేషన్ జరగలేదు. ఇది వైసీపీకి ముఖ్యంగా ఆశించిన సామాజిక మద్దతు లభించకపోవడాన్ని స్పష్టం చేస్తుంది. చిత్తూరు సహా సీమ రాజకీయాల్లో మిథున్ రెడ్డి అరెస్టుతో ఎలాంటి ప్రత్యేక సానుభూతి రాలేదని పరిశీలకులు చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థించే నలుగురు నాయకులు మినహా ఈ పరిణామంతో పెద్దగా సానుభూతి లభించలేదు. ఇది వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. పుంగనూరులో బోడే రామచంద్ర సహా టీడీపీ నాయకులు మిథున్ రెడ్డి అరెస్టుపై సంబరాలు చేసుకోవడం గమనార్హం. పెద్దిరెడ్డిని సమర్థించేవారు కూడా పెద్దగా స్పందించకపోవడం వైసీపీకి ఆందోళన కలిగించే అంశం.


ఓవరాల్‌గా చూసుకుంటే, మిథున్ రెడ్డి అరెస్టు వైసీపీకి ఎటువంటి సానుకూలతను తీసుకురాలేదు. పార్టీలో అంతర్గత ఐక్యత లోపించడం, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం, సీమ రాజకీయాల్లో సానుభూతి రాకపోవడం వంటి అంశాలు వైసీపీకి నష్టంగానే పరిగణించబడతాయి. ఈ పరిణామం పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: