
రాజకీయాల్లో నేతలకు భవిష్యత్తుపై ఊహలు, వ్యూహాలు ఉండటం సహజం. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం ఊహలే ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ మిళితం) వేగంగా విశ్వాసాన్ని సొంతం చేసుకుంటున్న సమయంలో కూడా, వైసీపీ మాత్రం “ప్రజలు తమకు తిరిగి మద్దతు ఇస్తారు” అన్న ధీమాతో కూర్చుంది. కొత్త ప్రభుత్వం సంక్షేమ పథకాలూ, అభివృద్ధి చర్యలూ వేగంగా అమలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకుంటోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోయే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటి పథకాలు ప్రజలలో మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీ మాత్రం ఈ పథకాలను లైట్ తీస్కొంటోందన్న విమర్శలు వస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వైసీపీ తడబాటు :
జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలపై ఆధారపడుతూ “వైసీపీ 2.0” పేరుతో తిరిగి ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉంది. కానీ ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, కొత్త ప్రభుత్వ పంథాను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం వైసీపీకి నష్టమే కలిగిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటిపైనా ప్రత్యర్థులు గట్టిగానే ప్రచారం చేస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం అందుకు గట్టిగా ప్రతిస్పందన ఇవ్వడంలో వెనకబడుతున్నారు.
వైసీపీకి ఉన్న మరో సమస్య అభివృద్ధి విషయాలపై జగన్ మౌనంగా ఉండడం. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల కూడా ప్రజల్లో వైసీపీ పట్ల సానుకూలత రావడం లేదు. తాను గతంలో చేసిన అభివృద్ధిపై జగన్ స్వయంగా మాట్లాడాలి.. అవి ప్రజల్లోకి వెళ్లాలి.
వైసీపీ తన 2.0 స్ట్రాటజీపై ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా ఊహల పైనే ఆధారపడితే అది పెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలి పోతుంది. కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, వైసీపీ తక్షణమే వ్యూహాలను మార్చుకుని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిపైనా స్పష్టమైన ప్రచారం చేయకపోతే, ప్రజల్లో మరింత వెనుకబడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు