వన్ నేషన్ వన్ ఎలక్షన్...వన్ నేషన్ వన్ లాంగ్వేజ్... ఈ జాబితాలోకి ఇప్పుడు మరో  స్లోగన్ వచ్చి చేరింది. దేశంలోని పౌరులందరికీ ఒకేరకమైన గుర్తింపు కార్డు తెచ్చే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్... పాస్ పోర్టు... డ్రైవింగ్ లైసెన్స్.. ఓటరు కార్డు...వీటన్నింటినీ కలిపి ఒకే కార్డుగా తీసుకువచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. మరో రెండేళ్లలో చేపట్టే జనాభా లెక్కల నాటికి దీన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు... ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న విధానం ఇదే.  అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఆధార్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఆధార్ అన్నది అన్నింటికీ ప్రత్యామ్నాయం కాదు. దేశం దాటాలంటే పాస్ పోర్టు ఉండాల్సిందే... ఓటు వేయాలంటే ఓటరు ఐడీ తప్పనిసరి.  ఇక బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒక వ్యక్తి పేరుతో ఇన్ని కార్డులు ఉండాల్సిన అవసరం ఉందా అన్న అలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ అన్ని కార్డులను కలిపి ఒకే కార్డుగా మార్చి దేశమంతా ఒకే గుర్తింపు కార్డును తేవాలనుకుంటోంది. 


దేశవ్యాప్తంగా బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా... మల్టీపర్పస్ ఐడీ కార్డుపై మాట్లాడారు. జాతీయ పౌర రిజిస్టర్‌...అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతున్న కేంద్రం...దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి డేటాతో మల్టీపర్పస్ ఐడీ కార్డును తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వ్యక్తి చనిపోతే ఆ డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అయ్యే వ్యవస్థను తీసుకురావాలన్నారు అమిత్ షా. 


2021లో  దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల కార్యక్రమం నాటికి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణను ఈ సారి పూర్తిగా డిజిటల్ రూపంలో చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకువస్తున్నారు. జనాభా లెక్కల సేకరణను మొక్కుబడిగా నిర్వహించకుండా  ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తామంటోంది బీజేపీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: