కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. మార్చి 20వ తేదీ నుంచే భక్తుల దర్శనాన్ని నిలిపివేసిన టీటీడీ పెద్దమొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. ఇప్పటివరకు 33 రోజుల్లో సుమారు 130కోట్లకుపైగా ఆదాయం కోల్పోయినట్లు అధికావర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుమల కొండపై అన్ని షాపులను మూసివేసిన విషయం తెలిసిందే. ట్రావెల్స్ను కూడా బంద్ చేశారు. ఇలా అనేక మార్గాల్లోవచ్చే ఆదాయం మొత్తం నిలిచిపోవడంతో.. టీటీడీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీటీడీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం కోల్పోవడం ఇదే మొదటిసారిగా పలువురు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే టీటీడీ తన పారిపాలనా కార్యకలాపాలను ప్రరంభించింది. సుమారు 30శాతం సిబ్బంది హాజరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అలాగే.. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు టీటీడీ కూడా భారీగా విరాళం అందించింది. జిల్లాకు కోటి రూపాయల చొప్పున ఏపీలోని 13జిల్లాలకు నిధులను కేటాయించింది. అలాగే.. కరోనాకు మందును కనిపెట్టే పనిలో టీటీడీ ఆయుర్వేద విభాగం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే..