ఉత్తి పుణ్యానికే చాలా కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని... తాను ఎవ్వరికి ఇబ్బంది కలిగించకపోయినా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టారని చింతమనేని చెప్పారు. నలుగురు ఎస్ఐలు తమ విధులకు ఆటంకం కలిగించినట్టు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జిల్లా మొత్తం తిప్పారని చింతమనేని చెప్పారు. తర్వాత మూడు రోజుల పాటు జైలులో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. అలాగే ఓ సీఐ కూడా తనకు వ్యతిరేకంగా కేసులు పెట్టుకున్నాడని.. తాను తన కుమార్తె పెళ్లి గురించి మాట్లాడేందుకు వెళుతుండగా.. అక్కడకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన వాపోయారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా ఇలాంటి సందర్భంలో కూడా తనను అడ్డుకున్నందుకు తాను బాధపడ్డానని చెప్పారు. అయితే తనను ఇంతలా వేధించిన పోలీసు అధికారులను వదిలే ప్రశక్తే లేదని చింతమనేని చెప్పేశారు. అట్టు పెట్టినమ్మకు అట్టున్నర పెట్టాలన్న సామెతను తాను నిజం చేస్తానని చింతమనేని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దిగజారిపోయి తనపై అంతలా కేసులు నమోదు చేస్తే .. తాను ఊరుకోలేనని.. తాను కూడా వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.
ఏ పోలీసులు అయితే తనపై లేనిపోని కేసులు పెట్టారో వారి హిట్ లిస్టు కూడా తాను రెడీ చేసుకున్నానని చింతమనేని అన్నారు. తనకు ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో ఇరికించారని.. ఇది ఎవరికైనా బాధకాదా? అని కూడా చింతమనేని ఆవేదనతో ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను పోలీసులను కూడా అడిగానని... ఎవరో చెప్పారని.. తనపై కేసులు ఎందుకు పెడతారని.. తనపై పెట్టిన కేసులు అన్నీ కూడా పెట్టీ కేసులో అని.. అవేవి నిలబడవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఆశీర్వదిస్తానని తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు.