ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భారతీయ మూలాలున్న మహిళే అన్న సంగతి తెలిసిందే. ఇక బడ్జెట్ వ్యవహారాల డైరెక్టర్గా నీరా టాండన్ నియమితురాలయ్యారు. అమెరికన్ సర్జన్ జనరల్గా ప్రతిష్ఠాత్మక స్థానంలో వివేక్ మూర్తి నియమితులయ్యారు. విధాన నిర్ణయాలతో ముడివడిన బైడెన్ ప్రసంగ తయారీ బృందానికి వినయ్ రెడ్డి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇలా మరో అయిదేళ్లపాటు శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడి బృందంలో ఇండియన్లే కొలువులు దక్కించుకున్నారు.
వీరంతా కీలక స్థానాల్లో ఉండటంతో.. భారత-యూఎస్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. అమెరికా రాజకీయాలు, పాలన వ్యవస్థలోనే కాదు.. అమెరికా ఆర్థిక రంగంలోనూ ఇండియన్లదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే.. అమెరికాలోని ఫార్చూన్ 500 కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, అడోబ్, ఐబీఎం, మాస్టర్ కార్డ్ వంటి పది విఖ్యాత సంస్థలకు భారతీయ మూలాలున్న వారే సారథ్యం వహిస్తున్నారు.
అంతే కాదు.. అమెరికాలోని ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయ సంతతికి చెందినవారే. డొనాల్డ్ ట్రంప్నకు ముఖ్య ఆరోగ్య సలహాదారుగా కూడా ఇండియన్ అమెరికన్ అయిన సీమా వర్మ ఉన్నారు. అంతేనా.. అమెరికావ్యాప్తంగా సగానికి సగం మోటెళ్ల ను భారత సంతతి ప్రజలే స్థాపించి నిర్వహిస్తున్నారు. 1960లలో అమెరికా బాటపట్టిన భారతీయులు క్రమంగా విస్తరించి అక్కడి ‘సిలికాన్ వ్యాలీ’లో మూడో వంతు అంకుర పరిశ్రమలకు యజమానులయ్యారు. ఆ దేశంలోని అత్యున్నత సాంకేతిక విజ్ఞాన ఆధారిత కంపెనీల్లో ఎనిమిదిశాతం భారత సంతతి స్థాపించినవే.