తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. అధికారంలోకి వచ్చేస్తామని కలలుకన్న నరేంద్రమోడి, అమిత్ అండ్ కోకు ఫలితాలు ఊహించని దెబ్బ కొట్టిందనే అనుకోవాలి. ఎన్నికల్లో బీజేపీ కొంప ముణిగిపోవటానికి అనేక కారణాలున్నా ప్రధానంగా ఒక కారణం వల్లే కమలంపార్టీకి తీరని నష్టం జరిగిందని అర్ధమవుతోంది. అదేమిటంటే ఎనిమిది దశల్లో పోలింగ్ జరగటమే. బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ఉద్దేశ్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరిగేట్లుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను మ్యానేజ్ చేసిందనే ఆరోపణలు అందరికీ తెలిసందే.  ఈ విషయమై అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జీతో పాటు ఇతర పార్టీలు అభ్యంతరాలు చెప్పినా కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమాత్రం లెక్కచేయలేదు.




సరే చేసేదేమీలేక పార్టీలు కమీషన్ నిబంధనలనే అనుసరించాయి. ఒక విడతో లేకపోతే రెండు విడతల్లోనో ఎన్నికలు జరిపితే మమతను తట్టుకోవటం కష్టమని మోడి, అమిత్ బావించారు. పైగా మమతను ధీటుగా ఎదుర్కోవటానికి రాష్ట్రంమొత్తం మీద బీజేపీకి నేతలు, కార్యకర్తల బలం కూడా లేదు. అందుకనే ఒకప్రాంతం నుండి మరోప్రాంతానికి నేతలు, కార్యకర్తలను తరలించటానికి వీలుగా ఎన్నికలను ఎనిమిది వాయిదాల్లో జరిగేట్లు ప్లాన్ చేశారు. అయితే తాము చేసిన ప్లానింగే తమ కొంపముంచేస్తుందని అప్పట్లో మోడి అండ్ కో ఏమాత్రం ఊహించినట్లులేదు. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచిందన్నట్లుగా అయిపోయింది బీజేపీ పరిస్ధితి.




బెంగాల్లో మొదటి రెండు విడతల ఎన్నికలు అయ్యేసమయానికి దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి మొదలైపోయింది. మరో రెండు విడతలు అంటే నాలుగు విడతల పోలింగ్ జరిగే సమయానికి బెంగాల్లో కూడా కరోనా సమస్య పెరిగిపోయింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మోడి వైఫల్యంపై జనాల్లో ఎలాగైతే వ్యతిరేకత పెరిగిపోయిందో బెంగాల్లో కూడా అలాగే వ్యతిరేకత పెరిగిపోయింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు, మృతులు పెరిగిపోయినట్లే బెంగాల్లో కూడా కేసులు, మృతులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో కేసులు, మృతులు పెరిగిపోవటానికి మోడి రాజకీయమే కారణమనే మంట జనాల్లో బాగా పెరిగిపోయింది. ఆ మంట వల్లే చివరి నాలుగు విడతల్లో బీజేపీకి వ్యతిరేకంగా జనాలు ఓట్లేయటానికి కారణమైంది. మొత్తానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మమతను ఆదుకుంటే మోడి కొంపముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: