ఎండాకాలం మొదలైంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పుడిప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే భగ భగ మండే ఎండల వల్ల వేడిని భరించలేక చాలా మంది చల్లటి నీడ, చల్లటి గాలుల కోసం పరుగులు పెడుతుంటారు. చాలామంది ఏసీలు బిగించుకోవడం, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు. ఫ్యాన్ గాలి ఉన్నా.. వేసవిదెబ్బకి అది కూడా వేడిగా ఉండటంతో.. అందరి మనసు ఏసీ వైపే లాగుతుంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది కనీసం పది పదిహేను నిమిషాలు కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఏసీలు మితిమీరి వాడితే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే, నష్టాలే ఎక్కువ. ఎందుకంటే.. ఏసీలు ద్వారా వచ్చే చల్లదనం సహజసిద్ధమైనది కాదు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీ వల్ల బ్లడ్లో ఆక్సిజన్ తక్కువై బాడీ త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని చాలా మందికి తెలియదు. అలాగే ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల.. ఫ్రెష్ ఎయిర్ అందక.. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అవకాశం ఉంటుంది. ఫ్లూ, కామన్ కోల్డ్ వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా, ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది. విపరీతమైన తలనొప్పి, కళ్లు దురద రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా బయటి వాతావరణంలో గడపాలి. తలుపులు, కిటికీలు తెరచి సహజసిద్ధమైన గాలిని లోపలికి రానిస్తే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. సో.. ఏసీలు వాడుతున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి.