
టాలీవుడ్ లో అల్లరి నరేష్ పేరు అందరికీ సుపరిచితమే. కామెడీ హీరోగా ఎన్నో సినిమాలను చేసి తన ప్రత్యేకతను చాటుకున్న అల్లరి నరేష్ టాలీవుడ్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు. అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో కామెడీ చిత్రాలను చేశారు. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రవి బాబే నిర్మించడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది.
అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తమిళంలో కురుంబు అనే పేరుతో అల్లరి నరేష్ హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. శ్వేతా అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2002 లో విడుదల కాక అల్లరి నరేష్ కి బెస్ట్ డెబ్యూ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ కు గమ్యం సినిమా లోని గాలి శీను, శంభో శివ శంభో లోని మల్లి పాత్ర కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇవే కాకుండా కితకితలు, ప్రాణం, సీమ శాస్త్రి, గమ్యం, నేను బ్లేడ్ బాబ్జి వంటి సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే వరుస కామెడీ సినిమాలు చేస్తూ హిట్లు సాధిస్తున్నా కూడా అల్లరి నరేష్ స్టార్ హీరో అవ్వ లేక పోయాడు. ఒక టైంలో అల్లరి నరేష్ కు ఫ్లాప్ లు వచ్చిన సమయంలో అల్లరి నరేష్ హీరోగా కొనసాగడం కష్టం అనుకున్నారు కానీ ఆయనకు మహర్షి సినిమాలోని పాత్ర మళ్లీ వెరైటీ పేరును తీసుకువచ్చింది. కామెడీ పాత్రలే కాదు సీరియస్ పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకున్నాడు. మధ్యలో నేను అనే సినిమా ద్వారా నరేష్ ఈ ప్రయత్నం చేసినా ఆ సినిమా హిట్ కాకపోవడంతో మళ్లీ కామెడీ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులకు నాంది అనే సీరియస్ సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇప్పటినుంచైనా ఆయన అన్ని జోనర్ల సినిమాలు చేస్తారేమో చూడాలి.