
భాగ్య శ్రీ బోర్సే తొలి చిత్రం `యారియాన్ 2`. ఈ బాలీవుడ్ మూవీ 2023లో విడుదలైంది. ఇందులో మెయిన్ హీరోయిన్ కానప్పటికీ.. రాజలక్ష్మి అనే పాత్రను భాగ్య శ్రీ పోషించింది. ఆ తర్వాత `చందు ఛాంపియన్` అనే మరో హిందీ చిత్రంలో మెరిసిన భాగ్య శ్రీ.. `మిస్టర్ బచ్చన్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించారు. సినిమా డిజాస్టర్ అయిన కూడా భాగ్య శ్రీ తనదైన అందం, అభినయంతో యువత హృదయాలను గెలుచుకుంది. టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.
కెరీర్ లో ఇంతవరకు ఒక్క హిట్ లేకున్నా ప్రస్తుతం భాగ్య శ్రీ చేతినిండా సినిమాలే ఉన్నాయి. త్వరలోనే ఈ వయ్యారి `కింగ్డమ్` మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ జంటగా నటించారు. జూన్ 4న కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
అలాగే టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేనితో భాగ్య శ్రీ బోర్సే ఓ మూవీ కమిట్ అయింది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్.పి దర్శకుడు. `ఆంధ్రా కింగ్ తాలుకా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక రీసెంట్ సెన్సేషన్ భాగ్య శ్రీ టేకప్ చేసిన మరో ప్రాజెక్ట్ `కాంత`. దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ ఇది. ఈ మూవీలోనూ హీరోయిన్గా నటించే అవకాశాన్ని భాగ్య శ్రీ చేజిక్కించుకుంది. మొత్తానికి నిన్న మొన్నటి వరకు సైలెంట్గా కనిపించిన భాగ్య శ్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీనే రూల్ చేస్తోంది. మరి ఇక ముందు ఈమె కెరీర్ ఎలా సాగనుందో చూడాలి.