మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` విడుదలకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మించి నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన క‌న్న‌ప్ప‌లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్‌, బ్రహ్మానందం తదితరులు భాగం అయ్యారు. జూన్ 27న థియేట‌ర్స్ లో ఈ చిత్రం సంద‌డి చేయ‌బోతుంది. ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం నైట్ హైద‌రాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.


అయితే ఈ ఈవెంట్ లో ఓ వ్య‌క్తి మెయిన్ హైలెట్‌గా నిలిచారు. ఇంత‌కీ ఆయ‌న మ‌రెవ‌రో కాదు క‌న్న‌ప్ప డైరెక్ట‌ర్‌ ముఖేష్ కుమార్ సింగ్‌. నిజానికి ఈయన ఇంతవరకు పెద్దగా కనిపించలేదు. సినిమా అనౌన్స్మెంట్ దగ్గరనుంచి పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ విడుదల సమయాల్లో మరియు ఇతర ప్రచార కార్యక్రమాల్లో ముఖేష్ కుమార్ సింగ్ అస్సలు లేరు. మంచు విష్ణు, మోహన్ బాబు కూడా ప్రమోషన్స్ లో డైరెక్టర్ పేరు ప్రస్తావించకపోవడం ఎన్నో అనుమానాలకు దారి చేసింది.


ఒకానొక దశలో అసలు కన్నప్ప డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తింది. అయితే ఎట్టకేలకు ఆయ‌న బయటకు వచ్చారు. ఇంతకుముందు ముఖేష్ కుమార్ `మహాభారత్‌` సీరియల్ కు దర్శకత్వం వ‌హించారు. ఈయనకు తెలుగు రాదు. అయినప్పటికీ మంచు విష్ణు, మోహన్ బాబు ఆయన్ను నమ్మి కన్నప్ప వంటి భారీ ప్రాజెక్టును చేతిలో పెట్టారు. ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. `హైద‌రాబాద్ గ‌త రెండేళ్ల నుండి నా సొంత‌ ఇల్లు అయిపోయింది. మోహన్ బాబు గారి వల్లే ఇక్కడికి వచ్చాను. ఆయన ధైర్య సాహసాలకు హాట్సాఫ్.


కొబ్బరికాయలా మోహ‌న్ బాబు గారు పైకి ఎంత గట్టిగా ఉన్నా లోపల మాత్రం మృదువుగా, స్వచ్ఛంగా ఉంటారు. విష్ణు లాంటి న‌టుడితో ఇంత‌వ‌ర‌కు నేను పనిచేయలేదు. ఎలాంటి క్లిష్టమైన సీనైనా ఒకట్రెండు టేకుల్లోనే కంప్లీట్ చేస్తారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రభాస్‌ రెబల్ స్టార్ అని అందరికీ తెలుసు. కానీ నా దృష్టిలో ఆయ‌న హంబుల్ స్టార్` అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ముఖేష్ కుమార్ సింగ్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. `హమ్మయ్య కన్నప్ప డైరెక్టర్ ను చూసేసాం రా` అంటూ నెటిజ‌న్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: