
శాసనమండలి ఎన్నికల తాజా ట్రెండ్ తో బాగా నష్టపోయింది బీజేపీనే అని అర్ధమైపోతోంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎంఎల్సీ స్ధానంలో గెలుస్తామని బీజేపీ బాగా ఆశలు పెట్టుకున్నది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంఎల్సీ మళ్ళీ గెలుస్తానని మంచి నమ్మకంతో ఉన్నారు. అయితే ఊహించని షాక్ తగిలింది. దారుణంగా ఓడిపోతున్నారు. ఫైనల్ రిజల్టు రాకపోయినా మాధవ్ ఓటమి ఖాయమని తేలిపోయింది.
ఎందుకంటే మొదటిస్ధానంలో టీడీపీ అభ్యర్ధి చిరంజీవి రావు, రెండోస్ధానంలో వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్, మూడోస్ధానంలో పీడీఎఫ్ అభ్యర్ధి రమాప్రభ ఉన్నారు. నాలుగోస్ధానంలో ఉన్నారు కాబట్టి మాధవ్ ఓడినట్లే అనుకోవాలి. గెలుపు ఎవరిదో తేలకపోయినా మాధవ్ ఓటమి మాత్రం ఖాయమైపోయింది. ఇక్కడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై పార్టీలో చర్చ మొదలైంది. ఆమధ్య పవన్ మాట్లాడుతు ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపిచ్చారు.
ఉత్తరాంధ్రలో జనసేన బలం పుంజుకున్నదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరచూ ప్రకటనలు చేస్తుంటారు. పట్టభద్రుల కోటాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీతో పాటు పవన్ అభిమానుల్లో వేలాదిమంది పట్టభద్రులు ఉండేవుంటారు. తమ అధినేత పిలుపుమేరకు వీళ్ళంతా కచ్చితంగా టీడీపీకే ఓట్లేసుంటారనే అనుకోవాలి. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో జనసేన కలిసి పోటీచేయబోయేది టీడీపీతోనే అని అందరికీ అర్ధమైపోయింది. కాబట్టి టీడీపీ అభ్యర్ధి గెలుపులో జనసేన ఓట్లు కలిసే ఉంటాయనటంలో సందేహంలేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీని ఓడించమని పవన్ పిలుపిచ్చారు కానీ మిత్రపక్షం బీజేపీకి ఓట్లేయమని మాత్రం చెప్పలేదు. బీజేపీకి ఓట్లేయమని పవన్ చెప్పుంటే జనేసేన+అభిమానుల ఓట్లు మాధవ్ కే పడుండేవేనేమో. అప్పుడు బీజేపీ, టీడీపీ మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీ లాభపడే అవకాశముండేది. ఏదేమైనా మాధవ్ ఓటమిలో పవన్ పాత్రపైన కమలంపార్టీలో అప్పుడే చర్చ కూడా మొదలైపోయింది. పవన్ వైఖరిపై కమలనాదుల్లో మంట మొదలైంది. మొన్నటివరకు జనసేన ఓట్లన్నీ తమకే పడతాయని, పవన్ తమతోనే ఉంటారని చెప్పుకున్న బీజేపీ చీఫ్ సోమువీర్రాజు తాజా ట్రెండ్ పై ఏమంటారో చూడాలి.