ఈ నేపథ్యంలో ఈ వరుస కూటములకు కారణాలేంటో ఇప్పటికైనా కేసీఆర్ చూసుకోవాలి. ముఖ్యంగా టీ ఆర్ ఎస్ ఓటమికి వరదలు కారణమని చెప్పాలి.. పాలన అస్త వ్యస్త మైనప్పుడు ప్రకృతి కూడా ఆగ్రహించి ప్రజల మనసు మారుస్తుంది అనడానికి ఇదో ఉదాహరణ.టీ ఆర్ ఎస్ చేజార్చుకున్న ప్రాంతాలను చూస్తే వరద ప్రభావిత ప్రాంతాలే సీట్లు తగ్గడానికి కారణమని తెలుస్తుంది. వరదల ముందు కేసీఆర్ నిర్వహించిన సర్వేలో 94 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని తేలినట్లు ఆయన ప్రకటించారు. బీజేపీకి కాస్తో కూస్తో సీట్లు పెరుగుతాయని చెప్పారు.
తీరా చూస్తే కాస్తో కూస్తో కాదు.. టీఆర్ఎస్ తో సరిసమానంగా బీజేపీ సీట్లు సాధించుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ దాదాపుగా బీజేపీకే జై కొట్టాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్ నియోజకవర్గాల్లో కారు వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించినా పంపిణీలో పొరపాట్లు, కొందరు నేతల అవినీతి వల్లే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లినట్లుగా భావించవచ్చు. మొత్తం అన్ని డివిజన్లలోనూ బీజేపీ అభ్యర్థులే గెలవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం చేసిన సహాయం అందరికీ అందకపోవడం, దాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడం కారణంగా ఆ ప్రాంతాల్లో టీఆర్ఎస్కు నష్టం వాటిల్లడానికి కారణాలు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ సత్తా చాటింది.