ఏలూరులో మూర్ఛవ్యాధి దావానలంలా వ్యాపించింది. ఉన్నట్టుండి ఒక్కొక్కరూ స్పృహతప్పి పడిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పట్టణంలో దాదాపు 100మంది ఇవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ముందు దక్షిణ వీధిలో కొందరు ఈ లక్షణాలతో పడిపోయారు. ఆ తర్వాత రాత్రికి పడమర వీధి, కొత్తపేట, అశోక్ నగర్, అరుంధతిపేట.. సహా మరికొన్ని ప్రాంతాల్లో మూర్ఛ లక్షణాలతోనే రోగులు పడిపోయి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఒక్కసారిగా పట్టణంలో కలకలం రేగింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్త మరింతగా వ్యాపించి ఆందోళనకు గురి చేసింది. ఏలూరులో అంతు చిక్కని రోగం వచ్చిందని, ప్రజలంతా పిట్టల్లా రాలిపోతున్నారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారంటూ రకరకాల వార్తలొచ్చాయి.

ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురవడానికి కారణాలేమిటో వైద్యులు, అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు రోజులుగా తాగునీరు రంగుమారి వస్తోందని, వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా అసలు విషయం ఏంటో తెలియరాలేదని ఆందోళనగానే ఉన్నారు స్థానికులు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలకు తీసుకొచ్చారు. వీటిని పరీక్షించాక అస్వస్థతకు సరైన కారణాలు తెలుస్తాయి.

శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 100మందికి పైగా ఇవే లక్షణాలతో వచ్చారు. వీరందరికీ వెంటనే ఆక్సిజన్‌ అందించడంతో కొద్దిసేపటికే తేరుకున్నారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చే అంశం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి ఏలూరులో పర్యటించారు. అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు మంత్రి. విజయవాడలోనూ అత్యవసర ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: