తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా సందడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ కమ్మ నేతలది అదే పరిస్తితి.

గత ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంట్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు, నరసారావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు చోట్ల టీడీపీ ఓడిపోయింది. అలాగే పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఓటమి పాలైంది.

అయితే ఇందులో మాచర్ల, నరసారావుపేట అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన ఐదు స్థానాల్లో కమ్మ నేతలే పోటీ చేశారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో జి‌వి ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్‌లు పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్లమెంట్ స్థానంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గాల బాధ్యతలు వారే చూసుకుంటున్నారు. కాకపోతే కోడెల మరణంతో సత్తెనపల్లి బాధ్యతలు ఆయన కుమారుడు కోడెల శివరాం చూస్తున్నారు. ఏది ఎలా చూసిన ఈ పార్లమెంట్‌లో కమ్మ నేతలే టీడీపీని నడిపిస్తున్నారు. పైగా నరసారావుపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా జి‌వి ఆంజనేయులు ఉన్నారు. అయినా సరే పార్లమెంట్ పరిధిలో పూర్తిగా సైకిల్ బలం పుంజుకోలేదు.

ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ పూర్తిగా అధికార వైసీపీ డామినేషన్ ఉంది. అయితే టీడీపీ కమ్మ నేతలు ఎక్కువ సమయం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే, నెక్స్ట్ ఎన్నికల్లోపు సైకిల్‌ని నిలబెట్టొచ్చు. లేదంటే మళ్ళీ ఫ్యాన్ హవానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: