ఇవాళ ఉండాలి ఆయన
కానీ కరోనా కారణంగా
ఇంటికే పరిమితం!
మరి! ఇన్నేళ్లుగా ఆయన జ్ఞప్తిలో
వీరు సాధించిన ఫలితాలేంటి?
ఏటా అన్నగారి వర్ధంతికి నందమూరి కుటుంబంతో పాటు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నారా వారి బిడ్డ చంద్రబాబు హాజరై,ఘాట్ వద్ద నివాళులు అర్పించడం ఓ ఆనవాయితీ.ఈ సారి మాత్రం ఆ భాగ్యం అల్లుడు చంద్రం సర్ కు దక్కలేదు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ కే పరిమితం అయ్యారు.దీంతో వర్ధంతి కార్యక్రమాలు అన్నీ కేవలం బాలయ్య బాబు నేతృత్వంలోనే జరిగాయి.ఎప్పటిలానే బాలయ్య బాబుతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్ని అన్నగారికి నివాళులిచ్చారు.తొలుత బాలయ్య తన ఆలయం (బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద) వద్ద అమ్మనాన్నల విగ్రహాలకు పూల మాలలు వేసి కొద్ది సేపు మౌనం పాటించి, తన వారి తరఫున ప్రార్థించి వచ్చారు. ఇవన్నీఏటా జరిగేవే కానీ ఈ ఏడాది వర్ధంతి వేళ చంద్రబాబు దూరం అయిపోయారు.దీంతో ఆయన తో పాటు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా అలానే ఇళ్లకే పరిమితం అయిపోయారు.
లోకేశ్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా గుమ్మం దాటలేకపోయారు.ఇదిలా ఉంటే ఏటా పార్టీకి సంబంధించి నాలుగు మాటలు చెప్పాలన్నా, తరువాత కార్యాచరణ గురించి ఏమయినా సూచనలు చేయాలన్నా బాబు దీన్నొక సందర్భంగా వాడుకున్న దాఖలాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆ మాటలు రొటీన్ గా ఉన్నా కూడా అల్లుడు హోదా ఇప్పటికీ అంతో ఇంతో హుందా ఉన్న వ్యక్తి, పొలిటికల్ ఛార్మింగ్ ఉన్న వ్యక్తి ఆ ఇంటి ఒక్క చంద్రబాబే కావడం ఇప్పటికీ ఎప్పటికీ విశేషమే! ఆయనతో పోలిస్తే మిగతా వ్యక్తులెవ్వరు అంతటి స్థాయిలో రాజకీయంలో రాణించలేకపోయారు.
అన్న గారి మనవరాలు హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు.కనుక ఆ ఇంటికి ఇప్పటికీ ఎప్పటికీ పెద్ద దిక్కుగా భావించే చంద్రబాబు ఇవాళ స్వల్ప కరోనా లక్షణాలతో ఇంటికే పరిమితం అయినా భవిష్యత్ లో పార్టీ దశనూ దిశనూ నడపాల్సిన శక్తి ఇంకా ఆయనలో ఉందా అన్న సందేహాలు కూడా ఇదే సమయంలో వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్థానంలో లోకేశ్ వచ్చినా కూడా ఆయనను కూడా అంగీకరించి నెత్తినపెట్టుకునే స్థాయి ఇవాళ పార్టీలో లేదు.ఇదే సందర్భంలో చంద్రబాబు కు అచ్చొచ్చిన పాలిటిక్స్ లోకేశ్ కు ఎలా కలిసివస్తాయో కూడా ఇప్పటిదాకా ఎటువంటి అంచనా లేదు. ఏ విధంగా చూసుకున్నా బాబు గారి హవా దగ్గర కొడుకు దిగదుడుపే అని ఎప్పుడో తేలిపోయింది.