ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను త్వరలో విస్తరించడానికి, ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ అగ్ర నాయకులు, ప్రభుత్వంలోని ముఖ్యులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పెద్దలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగుల్లో ప్రధానంగా చర్చిస్తున్నారు.

ఈ భారీ ప్లాన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవలే వైసీపీ ఎంపీ సాయిరెడ్డి స్థానంలో కొత్త రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ నామినేట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయని టాక్.

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు చూస్తోంది. ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో, ఇక్కడ తమ ఉనికిని చాటుకోవాలని యోచిస్తోంది.

సాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తమిళనాడు బీజేపీ లీడర్ కె. అన్నామలైకి దక్కే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఒకవేళ కేంద్ర మంత్రి పదవికి ఓకే అంటే, మోదీ కేబినెట్‌లో కీలకమైన శాఖ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే యాక్టివ్‌గా ఉండాలనుకుంటే, బీజేపీ జాతీయ కోర్ కమిటీలో ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, అన్నామలైకి రాజ్యసభ ఎంపీ పదవి దాదాపు ఖాయమైపోయినట్టే. ఒకవేళ ఆయన రాజ్యసభకు వెళ్తే, కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. అలా జరిగితే, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్లాన్స్‌లో అన్నామలై కీలక పాత్ర పోషిస్తారు.

ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు మాత్రం ఇప్పటివరకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. ఈసారి మాత్రం బీజేపీ లెక్కలు మార్చేలా ఉంది. మరి మోదీ కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: