ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పుల వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ వైపు చూస్తున్నారు. రాజకీయాల్లో దశాబ్దాలుగా చురుకుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు తమ వారసులకు అవకాశం ఇవ్వాలని సంకల్పించారు. రాబోయే ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించి, తాము వెనుకనుండి మార్గనిర్దేశం చేయాలని భావిస్తున్నారు. ఈ పరిణామాల కారణంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవతరించబోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబం కీలక పాత్ర పోషించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే తన మనసులోని మాట బయటపెట్టారు - ఇక తాను విశ్రాంతి తీసుకోవాలని, తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాజకీయాల్లోకి రావాలని సంకల్పించారు. అదే దారిలో ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం.
 

అయితే పార్టీ మాత్రం ఈ సీనియర్ నేతలను ఇంకా కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది. వయస్సు 70 దాటుతున్న కృష్ణదాస్‌పై పార్టీ ఒత్తిడి ఉన్నా, ఆయన తన వారసుడి కోసం లాబీ చేస్తున్నారు.ఇక ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితీ కూడా అంతే. ఆయన రాజకీయంగా వెనకడుగు వేస్తారని, కుమారుడికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీ అంతర్గత లెక్కలు కారణంగా తమ్మినేని కుమారుడి రాజకీయ భవిష్యత్తు సస్పెన్స్‌గా మారింది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు వారసుడు కూడా రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో అవకాశం దొరకదనే టాక్ వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత కిమిడి కళావెంకటరావు కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు రాజకీయ రంగంలో చురుకుగా తిరుగుతున్నాడు.

 

అయితే కుటుంబంలో ఇద్దరు వారసులు ముందుకు రావడంతో పార్టీ తలనొప్పి పెరిగింది. ఇక వైసీపీ వైపు చూస్తే, బొత్స కుటుంబంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా దాదాపు నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. తమ వారసులకు పగ్గాలు అప్పగించాలని ఆశపడుతున్న వీరు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే - ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెద్ద రకమైన మార్పులు తథ్యం. సీనియర్లకు విశ్రాంతి, వారసులకు ఎంట్రీ - ఇది రాబోయే ఎన్నికల ప్రధాన థీమ్‌గా మారబోతోంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ కొత్త రక్తం ప్రవేశించబోతుండటంతో, ఉత్తరాంధ్ర రాజకీయ రంగం కుదుపులకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: