తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు జూబ్లీ హిల్స్ పై ఉంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యంగా వచ్చిన ఈ ఉప ఎన్నిక రాజకీయ సమీకరణాలను తారుమారుచేయనుంది. సాధారణంగా ఇలాంటి ఉప ఎన్నికలను అధికార పార్టీలు తప్పించుకోవాలనుకుంటాయి కానీ ఈ సారి మాత్రం కాంగ్రెస్ే ఫైట్‌లో దూకేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఉత్సాహంలో ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఇది మొదటి అర్బన్ ఎన్నిక. అందుకే ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జూబ్లీ హిల్స్ పరిధిలో శూన్యమైనా, ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్టీ అంచనా.
 

సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని స్థానిక బీసీ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి ఓ పెద్ద కంబినేషన్ ప్లే చేసింది. లోకల్ సెంటిమెంట్‌తో పాటు మైనారిటీ ఓట్లు కూడా కాంగ్రెస్ బుట్టలో పడేలా వ్యూహాలు వేసింది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. ఈ సీటు తన గడపలోనే ఉందని నమ్మకంగా ఉంది. రెండు సార్లు వరుసగా గెలిపించిన మాగంటి కుటుంబం ఈ సారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సానుభూతి కార్డు, మహిళా అభ్యర్థి ఫ్యాక్టర్‌తో పాటు అర్బన్ ఓటర్లలో ఉన్న పాత పట్టు.. ఇవన్నీ బీఆర్ఎస్ దిశగా గెలుపు బాణాలను చూపిస్తున్నాయి. అయితే, బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందన్న విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి.



ఇక బీజేపీ విషయానికి వస్తే... ఇది త్రిముఖ పోరుకు గుండె! జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అర్బన్ ఓటర్లలో సత్తా చాటింది. ఇప్పుడు అదే ఫార్ములాతో బరిలోకి దిగింది. మోడీ ఫ్యాక్టర్, యువత ఆకర్షణ, మైనారిటీ వ్యతిరేక ఓటు బ్యాంక్ - ఇవన్నీ బీజేపీకి బూస్ట్‌గా మారొచ్చు. కానీ ఈ సారి ప్రత్యక్షంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బలమైన స్థాయి కలిగిన బీఆర్ఎస్‌ల మధ్య బీజేపీకి మార్జిన్ తక్కువే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయినా పార్టీ ధీమా మాత్రం వేరే లెవెల్‌లో ఉంది - “అద్భుతం జరుగుతుంది!” అంటోంది. గేమ్ చేంజర్ ఎవరు? .. ఈ ఉప ఎన్నికలో ఫలితం ఏదైనా కానీ, ఎఫెక్ట్ మాత్రం పెద్దది. బీజేపీ ఓట్ల శాతం పెరిగితే బీఆర్‌ఎస్‌నే గోడకు తాకిస్తుందా? లేక కాంగ్రెస్ గెలుపు మార్గంలో అడ్డుపడుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోటీగా మారిన ఈ జూబ్లీ హిల్స్ పోరులో ప్రతి పార్టీ భవిష్యత్తు సైతం లైన్‌లో ఉంది. చివరికి ఎవరు గెలిచినా — ఈ ఎన్నిక తెలంగాణ అర్బన్ రాజకీయాలకు కొత్త లెక్కలు రాస్తుందని మాత్రం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: