బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత హైలైట్ అవుతున్న పేరు ఏదైనా ఉంటే అది రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ) నేత తేజస్వి యాదవ్ దే. చిరాగ్ పాశ్వాన్ తర్వాత రాష్ట్ర రాజకీయ వేదికపై అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్న నాయకుడు తేజస్వి. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక స్ట్రాటజీ ఉంటుంది, కానీ ఆ నిర్ణయాలు మొదట ప్రజలకు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆయన సూటిగా వివరించే విధానం ఆయనకున్న ప్రత్యేకతగా మారింది.ఇప్పటివరకు తేజస్వి తీసుకున్న నిర్ణయాలు బీహార్ ప్రజలకు ఆశ్చర్యకరంగానే కాకుండా "బిగ్ షాక్" లా మారాయి. కానీ ఆ షాక్‌లోనే ప్రజలకు కొత్త ఆశ కూడా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

అందరూ మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూటమి గురించి ఆయన ఈసారి ఏదైనా కీలక ప్రకటన చేస్తారేమోనని ఊహించారు. కానీ తేజస్వి యాదవ్ మీడియా ముందు మాట్లాడుతూ ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఎన్నికల ప్రచారం, ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఆయన సూటిగా మాట్లాడుతూ, “నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మా దృష్టి మొత్తం ప్రచారంపైనే ఉంటుంది” అన్నారు.తేజస్వి మాట్లాడుతూ, బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఆతురంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆయన మాటల్లో, “బీహార్ ప్రజలు ఈ ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వంతో విసిగిపోయారు. నిరుద్యోగం, వలసలతో రాష్ట్ర యువత బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు.

ఆర్జెడి నేత తన ఎన్నికల ఎజెండాను కూడా స్పష్టంగా ప్రకటించారు. జీవికా దీదీ వర్కర్స్ గురించి ఆయన చెప్పిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మహాగట్ బంధన్ ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం జీవికా దీదీలను పర్మినెంట్ ఉద్యోగులుగా ప్రకటించే నిర్ణయం పైనే ఉండబోతోందని తేజస్వి హామీ ఇచ్చారు. అంతే కాకుండా అంగన్వాడి వర్కర్ల జీతాలను ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ₹30,000కు పెంచుతామని ప్రకటించారు. ఇది చిన్న నిర్ణయం కాదని, ఇది ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న డిమాండ్ అని తేజస్వి గుర్తు చేశారు. అదేవిధంగా జీవికా దీదీ డీఏ తో పాటు దాదాపు ₹5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించబోతున్నామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో ఆయన మరోసారి బీహార్ ఉద్యోగ వర్గానికి ఆశ కలిగించారు.

కూటమి విభేదాలపై స్పష్టత మహాగట్ బంధన్‌లో సీట్ల పంపకం విషయంలో ఎటువంటి విభేదాలు లేవని తేజస్వి స్పష్టంగా చెప్పారు.“మా కూటమి బలంగా ఉంది. ఇతర పార్టీ నేతలు చేసే ఊహాగానాలకు విలువ లేదు. ఆర్జెడి తన విధివిధానాల ప్రకారం ముందుకు సాగుతుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.

తాజాగా ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న సమయంలో తేజస్వి తన రాజకీయ వ్యూహాన్ని మార్చి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇది ఆయనకు మద్దతుదారుల మధ్య కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.తేజస్వి వ్యాఖ్యలు, ఆయన స్ట్రాటజీ చూసి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.“టైమ్ చూసి దెబ్బ కొడుతున్నావ్ తేజస్వి..! నిజమైన రాజకీయ నాయకుడు నువ్వే. పక్కవాళ్లను టార్గెట్ చేయడం కాదు, నిన్ను నువ్వు హైలైట్ చేసుకోవడమే అసలు రాజకీయం!” అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బీహార్ ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైన ఈ సమయంలో తేజస్వి యాదవ్ చేసిన హామీలు, ఆయనలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: