బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీకి పెద్ద హెచ్చరికలా మారాయి. ఎందుకంటే అక్కడ జరిగిన ఎన్నికల్లో కనిపించిన ఓటింగ్ ప్యాటర్న్… 2024 ఏపీ ఎన్నికల్లో కనిపించిన ప్యాటర్న్‌కు పక్కా రిప్లికా. ప్రత్యేకించి సాయంత్రం ఐదు గంటల నుంచి భారీగా మహిళలు పోలింగ్ బూత్‌లకు రావడం… క్యూ లైన్లలో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు వరుసగా ఓట్లు వేయడం అక్కడ కూడా, మన దగ్గర కూడా చోటు చేసుకుంది. ఏపీలో ఇదే మహిళల ఓటింగ్ వేవ్ వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. బీహార్‌లో అదే వేవ్ ఎన్డీఏకు రికార్డు బ్రేకింగ్‌గా 202 సీట్లు ఇచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు… రాజకీయ సిగ్నల్.


జగన్ ఇప్పటికీ “ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మళ్లీ నేను వస్తా” అని నమ్ముకుంటున్నా… బీహార్ ఫలితాలు చెప్పేది ఒకటే - మోదీ-బీజేపీ స్ట్రాటజీ ముందుంటే ఒంటరిగా ఉన్న పార్టీకి అవకాశాలు లేకపోవచ్చు. ముఖ్యంగా ఫీల్డ్‌లో లేకుండా, బెంగళూరులోనే కూర్చుని లెక్కలు వేసుకుంటే ప్రమాదం మరింత. ఇప్పుడిక భారత్‌లో ఎక్కడ ఎన్నికలు జరిగినా… బీజేపీ కూటమి అగ్రెసివ్ స్ట్రాటజీతో దిగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, షా, జాతీయ నేతలంతా ఫోకస్ పెడుతున్నారు. ఇది ఏపీకి వర్తిస్తుంది కాబట్టి చంద్రబాబు కూడా అదే లెక్కలో ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే - చంద్రబాబు నాయకత్వం + మోదీ బ్రాండ్ + పవన్ కళ్యాణ్ మాస్ = కూటమికి భారీ బెనిఫిట్ అందుకే తాజాగా చంద్రబాబు “టీడీపీ ఇక ప్రతిపక్షంలో ఉండదు” అని ధైర్యంగా చెప్పగలిగారు.



ఇదిలా ఉంటే వైసీపీ వర్గాల్లో మాత్రం “బీజేపీకి జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉంది” అన్న భ్రమ ఇంకా ఉంది. కానీ ఇది కేవలం భ్రమే. రాజకీయం లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. బీజేపీకి తాము కూటమిలో ఉన్నవాళ్లే ముఖ్యం. కాబట్టి అవసరమైతే జగన్‌ను రాజకీయంగా కూల్చేయడానికైనా వారు వెనకాడరు. ఎందుకంటే ఏపీ కూడా బీజేపీ జాతీయ లక్ష్యంలో కీలక భాగం. ఇందుకే ఇప్పుడు వైసీపీ నుంచి పలువురు నేతలు బీజేపీ జంప్‌కు రెడీగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ భవిష్యత్తుపై డౌట్స్… మరోవైపు కూటమి ప్రభావం – ఇవన్నీ నేతలను ఆ దిశగా నెట్టేస్తున్నాయి. సో… బీహార్ ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి - జగన్ మరింత జాగ్రత్త పడాల్సిన సమయం ఇదే. ఇప్పుడు కూడా గ్రౌండ్‌లోకి రాని, ప్రజలతో కనెక్ట్ కాకపోతే… జగన్ కూడా మరో తేజస్వీగా మారే ప్రమాదం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: