జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది ... కానీ, తెలంగాణ రాజకీయాల్లో దాని ప్రభావం ఊహించని విధంగా ఉంది. ఈ విజయం అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపి, రాష్ట్రంలో మ‌ళ్లీ 'ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర తీసింది. గతంలోనే ప‌దిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకొన్న కాంగ్రెస్, ఇప్పుడు మ‌రో ప‌దిమందిని లాగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, వరుసగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.


నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ నుంచి పదిమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నా, ఫిరాయింపుల చట్టంపై వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం బీఆర్ఎస్‌కు పెద్ద షాక్. ఈ ఒక్క గెలుపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచనా ధోరణిలో భారీ మార్పు తెచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీ ఓటమి పరంపరలో ఉన్నందున, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కారు దిగి, అధికార పక్షంలో సురక్షిత స్థానం చూసుకోవాలని భావిస్తున్నారు. అందుకే, 'ఆపరేషన్ ఆకర్ష్' మళ్లీ ఊపందుకుంది!



ఈ ఆకర్ష్ కార్యక్రమం ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టింది. గతం ఎన్నికల్లో రాజధాని పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్... జూబ్లీహిల్స్ గెలుపుతో ఉలిక్కిపాటుకు గురైన గ్రేటర్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట మాజీ ఎంపీ అజ‌హ‌రుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వడం కూడా ఈ వ్యూహంలో భాగమే అని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా అంగీకారమే. జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి... ఈ చేరికల అంశాన్ని అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.



అయితే, రేవంత్ రెడ్డి అధిష్ఠానం వద్ద న్యాయపరమైన చిక్కులు రాకుండా, రాజకీయంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని పట్టుబట్టినట్లు సమాచారం. మొత్తానికి, 'ఆపరేషన్ ఆకర్ష్'కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్... తెలంగాణలో తమ బలాన్ని అసాధారణంగా పెంచుకోవడానికి ఈ ఆకర్ష్‌ను అత్యంత కీలకంగా భావిస్తోంది. బీఆర్ఎస్ కంచుకోట కూలడం ఖాయం! అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్షం అల్లాడటం మొదలైంది!

మరింత సమాచారం తెలుసుకోండి: