``మా జిల్లాలో రోగాలు ఎక్కువ. కిడ్నీ బాధితులకు ప్రత్యేక హాస్పటల్ కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కట్టడం కాలేదు. ఇప్పుడు జిల్లాను విభజించారు. మరి మాకేం ప్రయోజనం చేసినట్టు?`` అని సిక్కోలు వాసులు ముక్తకంఠంతో అడుగుతున్నారు. ఇక, కడప, కర్నూలు, అనంతపురం.. వాసుల్లోనూ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ``మా జిల్లాల్లో ఉపాధి లేదు. కరువు ప్రాంతం. మా వాళ్లు వలస బాటపట్టారు. ఇప్పుడు జిల్లాలను విడదీశారు. మమ్మల్ని వేరే జిల్లాలో కలిపారు.
దీనివల్ల మాకు ఉపాధి దొరుకుతుందా? మాకు పనులు వస్తాయా? ఇదంతా ఎవరి కోసం .. చేశారు. ముందు మాకు ఉపాధి చూపించండి. జిల్లా నుంచి వలసలు తగ్గే లా చూడండి`` అని ఇక్కడి వారు కోరుతున్నారు. మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా వాదన వినిపిస్తోంది. సాగునీరు, తాగు నీరు లేని.. జిల్లాల్లో వీటి కోసం.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజన వల్ల.. తమకు జరిగేది ఏంటో సర్కారు పెద్దలే వివరించాలని కోరుతున్నారు. ఇక, మరోవైపు.. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు వాసులు మరో వాదనను తెరమీదికి తెస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల ధరలు పెంచారని.. ఫలితంగా.. రిజిస్ట్రేషన్.. ధరలు.. పెరిగిపోయాయని.. ఇళ్ల పన్నులు.. నీటి పన్నులు కూడా పెంచేశారని.. దీనివల్ల లేని భారం మాపై పడిందని. కొత్త జిల్లా ఏర్పాటుతో జరిగింది ఇదే కదా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా.. అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి. మరి వాటికి అధికార పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.