అప్పటి నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై జగన్కు పీకలదాకా కోపం ఉన్నా.. ఏమీ చేయలేకపోయారు. సొంత పార్టీ ఎంపీ కదా అని కొన్నాళ్లు ఊరకున్నారు. కానీ.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం శ్రుతి మించడంతో ఆయన్ను టార్గెట్ చేశారు. సీఐడీని రంగంలోకి దింపారు. రాజద్రోహం కేసు పెట్టేసి విచారణ పేరుతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అదే విచారణ పేరుతో ఆయన సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే అప్పటి నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లీలలన్నీ జగన్ చేతికి చిక్కినట్టే కనిపిస్తున్నాయి.
ఈ విషయం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎవరెవరితో మాట్లాడారు..ఏం ఏం వ్యవహారాలు నడిపారు.. అన్నది ఇప్పుడు సీఐడీ చేతిలో ఉంది. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజు - చంద్రబాబు చాట్ విషయం బయటకొచ్చింది. సాక్షి మీడియా ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీవీ5 ఛానల్ అధిపతి బీఆర్ నాయుడితో అక్రమ లావాదేవీలు నడిపారంటూ కొత్త అంశం తెరపైకి తెచ్చారు.
ఈ అంశంపై ఏకంగా గట్టి ఆధారాలతో ఏకంగా ప్రధానికే వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. ఇలా మొత్తానికి రఘురామ కృష్ణం రాజు అక్రమ వ్యవహారాలన్నీ జగన్ చేతికి చిక్కినట్టే కనిపిస్తున్నాయి. అయితే రఘురామ మాత్రం ఇంకా గంభీరంగానే కనిపిస్తున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో..!