భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పెద్ద కలకలం రేపే నిర్ణయం తాజాగా వెలువడింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణా కమిటీ కవితను సస్పెండ్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వివరణలు తీసుకోవడం, నోటీసులు ఇవ్వడం వంటి ప్రక్రియలు పాటిస్తారు. అయితే ఈసారి ఆ ప్రాసెస్ ఏదీ లేకుండా నేరుగా సస్పెన్షన్ వేటు వేసేయడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. అయితే ఇక్క‌డే ఆస‌క్తిక‌ర టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది బీఆర్ఎస్ సినిమాలో ఇంట‌ర్వెల్ అయితే.. ఇక జ‌ర‌గ‌బోయేది .. క‌విత వేసే అడుగులు క్లైమాక్స్ వ‌ర‌కు వెళ‌తాయ‌న్న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి క‌విత పొలిటిక‌ల్‌గా కంటిన్యూ అయితే మ‌నం చూసేది సెకండాఫ్‌.. క్లైమాక్స్ లేదా ఆమె రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటే సినిమా.. గేమ్ ఇక్క‌డితో ముగిసిన‌ట్టే అవుతుంది.


గత కొంతకాలంగా కవితపై చర్యలు తప్పవని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత బహిరంగంగా విమర్శించడం, తప్పు హరీష్ రావు, సంతోష్ ల మీద ఉందని వ్యాఖ్యానించడం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. పార్టీ లోపలే విభేదాలు ఉన్నాయనే సందేశం బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రెండు వైపులా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కవితపై చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు అవమానించబడినట్టే అవుతుంది. మరోవైపు చర్యలు తీసుకుంటే ఆయనకే స్వంత కూతురు పార్టీ నుంచి బహిష్కరించబడినట్టవుతుంది. ఈ రెండు నిర్ణయాలు పదునైన కత్తిలా మారడంతో, చివరికి పార్టీ ప్రతిష్ఠను కాపాడేందుకు కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా త‌న ముద్దుల కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.


కవిత విషయానికి వస్తే, ఈ పరిణామాలకు ఆమె ముందుగానే సిద్ధమై ఉన్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి అనే సంస్థను ఆమె కొత్తగా రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. త్వరలోనే జాగృతినే ప్రత్యేక రాజకీయ పార్టీగా ప్రకటించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నుంచి కవిత తప్పుకోవడం ఆమెకు కొత్త మార్గాలను తెరవవచ్చు. కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన ఈ విభేదం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేసీఆర్, కవితల మధ్య సంబంధాలు గతంలోనే దూరమయ్యాయి. కవిత జైలులో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా కేసీఆర్ పరామర్శించకపోవడం, బయటకు వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు ప్రాధాన్యం లేకపోవడం ఇవ‌న్నీ ఈ రోజు సస్పెన్షన్‌కు బాటలు వేసిన అంశాలుగా చెపుతున్నారు.


మొత్తానికి, కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం వల్ల కల్వకుంట్ల కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయినట్టే అయింది. ఇది కేసీఆర్‌కు మానసికంగా ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇకపై కవిత కొత్త పార్టీని ప్రకటిస్తే, అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS