తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావడం, రాజకీయాల్లో ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడంతో వీరి రాజ‌కీయం మ‌ధ్య కంపేరిజ‌న్ రావ‌డం స‌హ‌జ‌మే. షర్మిల విషయానికి వస్తే, జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె చేసిన పాదయాత్ర వైసీపీకి ప్రాణాధారంగా నిలిచింది. ఆ కాలంలో పార్టీని కాపాడి, కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తన సోదరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పదవులు ఇవ్వకపోవడం ఆమెకు తీవ్ర నిరాశ కలిగించింది. కనీసం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని వచ్చిన విన్నపాన్నీ పట్టించుకోలేదు. దీంతో ఆమె తెలంగాణకు వెళ్లి వైఎస్‌ఆర్‌టీపీని ప్రారంభించారు. ఆ పార్టీని క్రమంగా కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి ఏపీలోకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ స్థాయిలో ఒక జాతీయ పార్టీ పగ్గాలు చేపట్టడం ఆమెకు కొత్త బలం తెచ్చింది.


ఇక కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే, ఆమె తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ద్వారా సాంస్కృతికంగా ప్రజల్లో చైతన్యం రేపారు. ఉద్యమ సమయంలోనే బీఆర్‌ఎస్ (అప్పుడు టీఆర్‌ఎస్)లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికై పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 2024లో ఓటమి చెందారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక‌య్యారు. పదవిని కొనసాగించారు. అయితే ఇటీవల పార్టీ అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాల కారణంగా బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. చివరికి ఎమ్మెల్సీ పదవికీ, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు.


కాబట్టి షర్మిల, కవిత ఇద్దరూ "బాధితులు" అనే అభిప్రాయం ఉన్నా వారి రాజ‌కీయ‌ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. షర్మిల పార్టీ కోసం కష్టపడ్డా పదవి దక్కలేదు. కవిత మాత్రం పార్టీ కోసం పని చేసి, పదవులు కూడా అనుభవించారు. ఒకరికి గుర్తింపు లేకపోవడం బాధ కలిగిస్తే, మరొకరికి అంతర్గత విభేదాలే అడ్డుగా నిలిచాయి. ప్రస్తుతం షర్మిలకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న స్థానమే బలం. భవిష్యత్తులో రాజ్యసభ లేదా మరో కీలక స్థానం కూడా దక్కే అవకాశముంది. కానీ కవిత పరిస్థితి మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆమె మళ్లీ పార్టీతో కలుస్తారా, లేక కొత్త దారిని ఎంచుకుంటారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తంగా, ఇద్దరి రాజకీయ ప్రయాణాలు వేర్వేరు గమ్యాల్లో ఉన్నా, ఒక రకంగా ఇద్దరూ కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నారనే విషయమే స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: