ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్ బి)....ఇక్కడి విద్యను అభ్యసించడం భారత్ లో చాలా మందికి అందని ద్రాక్ష పండు. ఎందుకంటే పరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటారు. అది కూడా వివిధ పరీక్షల్లో మెరట్ సాధించిన తరువాతనే. ఫీజులు కూడా ఎక్కువే. సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఇక్కడి విద్యార్థులకు ఇచ్చే శిక్షణ అమూల్యం కావడంతో చాలా మంది మేనేజి మెంట్ కోర్సులు చదవాలనుకునే వారు ఇక్కడ సీటు సంపాదించడం కోసం తహతహలాడుతారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలలో చేరుతారు. చదువు పూర్తి కాక ముందే క్యాంపస్ ఎంపికల్లో వీరు కొలువుల్లో నియమితులవుతారు. దీంతో ఈ బిజినేస్ స్కూల్ యువతరానికి ఒక క్రేజ్. అంతే కాదు, వివిధ ఉద్యోగాలలో ఉండే వారు కూడా ఎక్కవ నైపుణ్యాలను సంపాదించుకునేందుకు ఇక్కడి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానం పుణ్యమా అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తన పాఠాలను సామాన్యులకు అందించ నుంది. వివిధ రాష్ట్రాలు ఐఎస్.బి తో ఒప్పందాలు చేసుకునేందుకు అసక్తి చూపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా తొలి అడుగులు వేసింది. ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి మోకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన మంత్రి మండలి లోని అధికార గణం ఇప్పటికే ఐఎస్ బితో పలు దఫాలు చర్చలు జరిపారు.