టాలీవుడ్ లో చాలామంది హీరోలు కరోనా టైమ్ లో నిదానించారు. అయితే కొంతమంది తెలివిగా సినిమా తర్వాత సినిమాని లైన్లో పెట్టారు. ముఖ్యంగా ప్రభాస్, రీఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ జోరు చూపించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఒకదాని తర్వాతే ఒకటి పూర్తి చేస్తున్నారు. అయితే వీరందరికంటే స్పీడ్ గా నాగచైతన్య దూసుకెళ్తున్నాడు. చైతూ.. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా పూర్తి చేశాడు, ఇప్పుడు థ్యాంక్యూ అనే మరో సినిమాని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చాడు.

వాస్తవానికి దర్శకుడు శేఖర్ కమ్ముల, సినిమా షూటింగ్ విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అని అందరికీ తెలుసు. అలాంటి శేఖర్ తో లవ్ స్టోరీ అనే సినిమాని సకాలంలో పూర్తి చేసిన చైతన్య.. ఆ సినిమా విడుదలకోసం వేచి చూస్తున్నాడు. సెకండ్ వేవ్ ప్రభావం మొదలు కాకపోయి ఉంటే.. వకీల్ సాబ్ తర్వాత, టాలీవుడ్ లో భారీ రిలీజ్ 'లవ్ స్టోరీ'యే అయి ఉండేది. అయితే అప్పటికే క్రమక్రమంగా థియేటర్లకు జనం రాక తగ్గిపోవడం, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో లవ్ స్టోరీ వెనక్కు వెళ్లిపోయింది. సినిమా ఆగినా.. నాగచైతన్య జోరు మాత్రం ఆగలేదు. థ్యాంక్యూ సినిమాకోసం ఇటలీలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు చైతన్య.

నాగచైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్.కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్యూ. దిల్‌ రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా... ఇటీవలే ఇటలీ వెళ్లిన ఈ చిత్ర బృందం మిలన్‌ తోపాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించి తిరుగు పయనమైంది. సినిమా సెట్లో నాగచైతన్య, రాశీఖన్నా సరదాగా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘వెంకీ మామ’ తర్వాత చైతూ, రాశీ రెండోసారి కలసి నటిస్తున్న సినిమా ఇది. ‘మనం’ మూవీతో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మరోసారి చైతన్యకోసం థ్యాంక్యూ వంటి మంచి కథ తో వచ్చారు. జెట్ స్పీడ్ తో సినిమా షూటింగ్ పూర్తవుతోందట. అంటే.. లవ్ స్టోరీతోపాటు.. సైమల్టేనియస్ గా థ్యాంక్యూ మూవీని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు చైతన్య. ఫస్ట్ వేవ్ అయినా, సెకండ్ వేవ్ అయినా తన సినిమాలు ఆగకుండా ప్లాన్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: