
కరోనా కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కళతప్పింది. దాదాపు రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు కొంత గ్యాప్ ఇచ్చినట్లే ఉంది. ఈ గ్యాప్ లో తొందరగా ఆగిపోయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసుకుని థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సినిమా నిర్మాతలు మరియు దర్శకులు. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులివ్వడంతో వీరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అనుకున్నట్లుగానే నిర్మాతలు వరుసగా సినిమాలను థియేటర్లో విడుదల చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండవ దశ కరోనా విలయం తర్వాత మొట్టమొదటి సినిమా విడుదలను అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక చిత్రబృందం. అయితే ఇప్పుడు ఆ సినిమా ఏమిటో చూద్దాం.
తెలుగు హీరోలలో స్వయం శక్తితో ఎదిగిన వారు చాలామందే ఉంటారు. అటువంటి హీరోలలో ఒకరే సత్యదేవ్. ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ప్రతిభని నిరూపించుకుని ఇప్పుడు ఒక హీరోగా వరుస సినిమాలను చేస్తున్నాడు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమే "తిమ్మరుసు". ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ ముందే పూర్తయినప్పటికీ, థియేటర్లను మూసివేయడంతో ఇప్పటి వరకు ఆగారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ప్రభుత్వం థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో,స్వయంగా సత్యదేవ్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సత్యదేవ్ కు జోడీగా ప్రియాంక జువాల్కర్ నటించనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి ఇంటరెస్ట్ ను క్రియేట్ చేసింది. ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించనున్నారు. శరన్ కొప్పిశెట్టి అనే యువ దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జులై 30 న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ నిర్మాత చేయని సాహసాన్ని చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి కథను బట్టి చూస్తే ఇది బంపర్ హిట్ అయ్యేలా ఉంది. కానీ ప్రేక్షకులు దీనికి ఎటువంటి తీర్పును ఇవ్వనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.