సాయి ధన్షిక.. ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బాగా వినిపిస్తున్న పేరు. తమిళ స్టార్ హీరో విశాల్ రీసెంట్ గా సాయి ధన్షికను వివాహం చేసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించాడు. కొంత కాలం నుంచి ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. ఆగ‌స్టులో మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే విశాల్ కు కాబోయే భార్యకు సంబంధించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే తమిళంలో ప్రముఖ నటి అయిన ధ‌న్షిక‌ను గతంలో స్టార్ హీరో శింబు తండ్రి, దర్శక నటుడు టీ. రాజేందర్ ఘోరంగా అవమానించారు. అందరి ముందు ధ‌న్షిక చేత‌ కన్నీళ్లు పెట్టించారు. విశాల్ తో పెళ్లి నేపథ్యంలో నాటి ఘ‌ట‌న మరోసారి ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


2017లో తమిళ చిత్రం `విజితిరు` ప్రమోషన‌ల్‌ ఈవెంట్ లో టీ. రాజేంద‌ర్‌, ధ‌న్షిక మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రెస్ మీట్‌లో సాయి ధన్షిక తన ప్రసంగంలో టీ. రాజేందర్ పేరును ప్రస్తావించ‌డం మ‌ర‌చిపోవ‌డంతో.. ఆయ‌న తీవ్ర‌ అసహనానికి గుర‌య్యారు. అదే స్టేజ్‌పై మాట్లడుతూ ధన్షికపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆ సమయంలో `క‌బాలి` చిత్రంలో రజినీకాంత్ కూతురిగా ధ‌న్షిక యాక్ట్ చేస్తోంది.



ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ టీ. రాజేంద‌ర్ సాయి ధ‌న్షిక‌ను దారుణంగా తిట్టారు. `ఒక్క హిట్టొస్తే చాలు సీనియ‌ర్ల‌ను మ‌ర్చిపోతారు. అంతెందుకు క‌బాలిలో రాజ‌నీకాంత్ తో క‌లిసి న‌టించ‌గానే ధ‌న్షిక‌కు కూడా పొగ‌రు పెరిగిపోయింది. క‌నీసం నా పేరు కూడా ఆమె చెప్ప‌లేదు` అంటూ రాజేంద‌ర్ హీరోయిన్ ను అంద‌రి ముందు దుయ్య‌బ‌ట్టారు. వెంట‌నే ధ‌న్షిక మైక్ అందుకుని ఆయ‌న సారీ చెప్పినా.. క్ష‌మించ‌మ‌ని కాళ్లకు న‌మ‌స్క‌రించినా.. టీ.రాజేంద‌ర్ ఆగ్ర‌హం మాత్రం చ‌ల్లార‌లేదు.

 

పైగా `సారీ ధరించకుండా వచ్చి, ఇప్పుడు సారీ అంటున్నారు` అంటూ మ‌రింత అసభ్యంగా ధ‌న్షిక‌ను రాజేంద‌ర్ విమ‌ర్శించారు. దాంతో ఆమె అక్క‌డే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అప్ప‌ట్లో ఈ ఇష్యూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పలువురు ప్రముఖులు ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. టీ. రాజేంద‌ర్ కు చుర‌క‌లు వేశారు. పొర‌పాటున పేరు మ‌ర్చిపోయినందుకు ఇంత ర‌చ్చ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న‌కు హిత‌వు ప‌లికారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్ కూడా అప్ప‌ట్లో రాజేందర్ ప్రవర్తనను ఖండించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: