ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే జోగి రమేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాధాకృష్ణా.. అమ్మ పాలు తాగుతూ బతికావా? నాగు పాము విషం తాగి బతికావా? అని మండిపడ్డారు. రాధాకృష్ణ విషసర్పంలా వెంటాడుతున్నా ప్రభుత్వాన్ని ఏ విధంగానూ అస్థిరపర్చలేరని జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్కు ప్రజా మద్దతు ఉందన్నారు. అసలు ‘బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? అంటే.. నారా చంద్రబాబు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుకు ఈ రాధాకృష్ణ ఓ బ్రోకర్ అంటూ మండిపడ్డారు.
ఇదే సమయంలో జోగి రమేశ్.. రాధాకృష్ణ గతం గురించి కూడా కామెంట్ చేశారు. ఒకప్పుడు సైకిల్పై తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వ్యవస్థపై, బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్ముతున్నాడని జోగి రమేశ్ మండిపడ్డారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వైశ్రాయ్ హోటల్ హానీ ట్రాప్ చేయలేదా? అని నిలదీశారు. రాధాకృష్ణ ఒక బ్రోకర్ అని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు.
ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్పై విషపు రాతలు రాయిస్తున్న రాధాకృష్ణ, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని జోగి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ సివిల్ సర్వెంట్లకు అండగా ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ జిల్లా కలెక్టర్లు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారని జోగి రమేశ్ అన్నారు. అలాంటి వారిపై రాధాకృష్ణ విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు.