అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని మహా కోరికగా ఉంది. కానీ ఇండియా మాత్రం పాక్ కూ మాకూ మధ్య మీ మధ్యవర్తిత్వం అవసరం లేదని ఖరాఖండీగానే చెబుతోంది. అయినా పాపం.. ట్రంపు మనస్సు ఊరుకోవడం లేదు. తాజాగా ఆయన మరోసారి మధ్యవర్తిత్వం గురించి మాట్లాడారు.
తాజాగా ఆయన న్యూయార్క్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్లతో కశ్మీర్ అంశాన్ని చర్చించానన్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, అందుకే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇద్దరూ నాకు మంచి స్నేహితులే, కశ్మీర్ సమస్య గురించి ఇద్దరూ చర్చించుకోవాలి, రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంలో భారత్-పాకిస్థాన్ల నడుమ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇరు దేశాధినేతలతో సమావేశాలు జరిగినప్పుడు చెప్పానని తెలిపారు. మధ్యవర్తిత్వం గానీ, సమస్యను పరిష్కరించడంగానీ చేస్తానని వారితో తెలిపినట్లు చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పాకిస్థాన్, భారత్ మీద గౌరవంతో కశ్మీర్ గురించి మాట్లాడాను. నా చేతనైన సాయం నేను చేస్తాను. వీలైతే వారి వివాదాన్ని పరిష్కరిస్తాను. లేదంటే మధ్యవర్తిగా ఉంటాను. ఎందుకంటే వారి మధ్య వివాదం ముదురుతోంది. త్వరలోనే ఇది సమసిపోతుందని ఆశిస్తున్నాను. ఇద్దరు జెంటిల్మెన్లు వారి దేశాలకు అధినేతలుగా ఉన్నారు. అవి రెండూ న్యూక్లియర్ దేశాలు. ఈ వివాదంపై ఇద్దరూ పనిచేయాలని చెప్పాను.’ అని వ్యాఖ్యానించారు. ట్రంపు ఎంత గోల పెడుతున్నా భారత్ మాత్రం సందు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది.