అమరావతి భూకుంభకోణంలో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సంచలనంగా మారాయి. ఈ కేసులో విచారణ మొదలు పెట్టిన ఏసీబీ.. నిందితులపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయకూడదని అరుదైన ఆదేశాలను ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీని ప్రచారం చేయడానికి వీళ్లేదని ఆదేశించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న 13 మందికి ఊరట లభించినట్లయింది.

ఈ కేసులో తదుపరి విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఈ ఉత్తర్వుల కాపీ అందుకున్న తర్వాత ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీ లను ఆదేశించింది. ఏసీబీ కేసులో విచారణ, దర్యాప్తు నిలిపివేయడంతో నిందితులుగా ఉన్న 13మందికి ఊరట లభించింది.

ఈ కేసులో ఏజీ శ్రీరామ్ వాదనలు కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి. ప్రతీ కేసులో ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు ఏజీ శ్రీరామ్. ఈ కేసులో కూడా ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం దారుణమని కోర్టులో వివరించారు. గాలి వార్తలు, వాళ్లూ వీళ్లూ చెప్పుకునే మాటల ఆధారంగా ముఖ్యమంత్రిపై నిందారోపణలు చేస్తూ ప్రతివాదిగా చేస్తున్నారని, ఈ కేసులో కూడా పిటిషనర్‌ అలానే చేశారని కోర్టుకు నివేదించారు. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేన్నారాయన. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, ముఖ్యమంత్రికి తాము ఎలాంటి నోటీసు ఇవ్వడం లేదన్నారు. అందరి వాదనలు విన్న సీజే, గంటన్నర తర్వాత ఉత్తర్వులు వెలువరించారు. ఏసీబీ కేసులో దర్యాప్తును నిలిపేశారు. నిందితులెవ్వరిపై కఠిన చర్యలొద్దని ఆదేశించారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: