దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సీనేషన్‌ కార్యక్రమం మరింత ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సహా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో ఎలాంటి దుష్ప్రభావాలు బయటపడలేదు. దీంతో తెలంగాణ అదనంగా మరో 184 సెంటర్లలో వ్యాక్సీనేషన్‌ ప్రారంభించారు.
        
దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ఓ క్రతువుగా జరుగుతోంది. మొదటి రోజే 2 లక్షల మందికి వ్యాక్సీన్‌ ఇచ్చి... రికార్డు సృష్టించారు మన వైద్య సిబ్బంది. రెండో రోజు ఆదివారం కావడంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగింది. కేవలం 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు.

ఏపీలోని 332 కేంద్రాల్లో నిన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. తొలి రోజు 19 వేల 108 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21 మందికి 291 మందికి వ్యాక్సిన్‌  వేయగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి మొదటి రోజు ఏపీకి కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ 14 వేల 300 మాత్రమే. ఇక రెండో రోజు విషయానికొస్తే... వ్యాక్సినేషన్ ‌ జరిగిన ఆరు రాష్ట్రాల్లో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. 13 వేల 41 మందికి వ్యాక్సీనేషన్‌ జరిగింది. అయితే ఏపీకి రెండో రోజు టార్గెట్‌ 27 వేల 233 కాగా, ఆదివారం కావడం దాదాపు సగం మంది లబ్ధిదారులు వ్యాక్సీన్‌ వేయించుకోడానికి రాలేదు.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌కు ఆదివారం విరామం ఇచ్చారు. నేటి నుంచి మళ్లీ టీకా పంపిణీ కొనసాగుతోంది. మొదటి రోజు వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడం వల్ల వ్యాక్సినేషన్‌ సెంటర్లను రెట్టింపు చేయడంతో పాటు టార్గెట్‌ను పెంచారు. మొద‌టి రోజూ 140 సెంట‌ర్లలో 3 వేల 962 మందికి వాక్సినేష‌న్ జరిగింది. నేటి నుంచి అదనంగా మ‌రో 184 సెంట‌ర్లలో టీకా పంపిణీ జరగుతోంది. దీంతో తెలంగాణ వాక్సిన్ సెంట‌ర్ల సంఖ్య 324కు చేరింది. ఒక్కో సెంటర్లో రోజుకు 50 మందికి వాక్సిన్ ఇస్తున్నారు.     

వాక్సిన్ పంపిణీకి కోవిన్ మొబైల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే యాప్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నా... వాక్సిన్ పంపిణీ కొనసాగించాలని వైద్యశాఖ నిర్ణయించింది. దీంతో వ్యాక్సీన్‌ సెంటర్లలో మాన్యువల్‌గా నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు వైద్యాధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: