సైబర్ నేరాలు సహా సామాజిక పరిస్థితులపై నెటిజన్లకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇలా అవగాహన కల్పించడం కూడా యువతకు అర్థమయ్యేలా, ఆకట్టుకొనేలా చెప్పడం వారి ప్రత్యేకత. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనాపై సైబర్ పోలీసులు యుద్దం మొదలుపెట్టారు. అందరికీ అవగాహన కలిగేలా కొన్ని వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక ఎనిమేటెడ్ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీడియోలో ఒక యువకుడు, పెద్దాయన బస్టాండ్ లో ఉన్నారు. పెద్దాయన మాస్క్ పెట్టుకున్నాడు కానీ ముక్కుకు దిగువన. యువకుడు మాస్క్ పెట్టుకోలేదు. బస్టాప్ లో ఆ యువకుడు తన చేయిని పక్కనే ఉన్న స్తంభం మీద పెట్టాడు. అక్కడే కరోనా వైరస్ కాచుకుని ఉంది. అది ఈ యువకుడి చేతిని పట్టుకుంది. ఆ యువకుడు ఆ చేతితో తన ముక్కు రుద్దుకున్నాడు. యువకుడు దగ్గాడు దాంతో పక్కనే ఉన్న పెద్దాయన మీద వాలాయి కరోనా వైరస్ కణాలు.

ఆ పెద్దాయన మాస్క్ పెట్టుకున్నా ముక్కు కవర్ కాలేదు. దీంతో అతనిని చక్కగా పట్టుకుని ఉన్నాయి కరోనా కణాలు. ఈలోపు అటుగా ఒక చిన్నారి, ఆమె తల్లి వెళుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ పెద్దాయన తుమ్మాడు. ఆ తుంపరలతో పాటు కరోనా కూడా ఆ తల్లీ, పిల్ల మీదకు చేరాయి. అయితే, అవి ఎంత ప్రయత్నం చేసినా వారి శరీరంలోకి ప్రవేశించలేకపోయాయి. ఇందులో అన్ని అంశాలూ ఇమిడిపోయాయి. 1. మాస్క్ ధరించాలి, 2. ఎట్టి పరిస్థితిలోనూ చేతితో ముక్కును తడమ కూడదు. 3. మాస్క్ ను ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. 4. ఒకరికి ఒకరు దగ్గరగా ఉండకూడదు. 5. బయట నుంచి ఇంటిలోకి వెళ్ళిన వెంటనే మాస్క్ శుభ్రం చేసుకుని, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వీటిని పాటిస్తే కరోనాకు అవకాశమే ఉండదు. ఈ వీడియో ద్వారా సైబరాబాద్ పోలీసులు మంచి సందేశాన్ని ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్కరికి తాము చేసే తప్పులను ఎత్తి చూపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: