ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ఇప్పుడు జనం వీటి కోసం ఎగబడుతున్నారు. అటు చూస్తే భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా  లేదు. అయితే ఈ వ్యాక్సిన్ల అంశంలో కేంద్రం వైఖరిపై జోరుగు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్ల సత్వర ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది.


సరిగ్గా ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. వ్యాక్సిన్ ముడిసరుకు సరఫరా విషయంలో అనేక ఆంక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా వ్యాక్సిన్ ముడి సరుకు భారత్‌కు వేగంగా, భారీ పరిమాణంలో అందబోతోంది. అయితే జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఉన్నారు.


వ్యాక్సీన్ విషయంలో ఇండియా ఇబ్బందుల గురించి తెలుసుకున్న హ్యారిస్.. బైడెన్‌తో చర్చించి ఈ నిర్ణయం వచ్చేలా చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత్‌కు కష్టకాలంలో సాయం చేసినందుకు ఆయన కమలా హ్యారిస్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక అమెరికా నుంచి వ్యాక్సీన్ ముడిసరకు సరఫరా పెరిగితే.. ఇండియాలో వ్యాక్సీన్ల తయారీ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది.

 
వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కారుకు ఇది తీపి కబురుగానే చెప్పొచ్చు. ఇప్పటికే కేంద్రం దేశీయంగా వ్యాక్సీన్ల ఉత్పత్తి పెంచేందుకు అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. నిన్ననే హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్ ఈ సంస్థతో 30 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది. అలాగే మహారాష్ట్రంలోని ప్రభుత్వ ఫార్మా సంస్థలో కోవాగ్జిన్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేసింది. మొత్తానికి మోడీ సర్కారు ఆలస్యంగా మేలుకున్నా వ్యాక్సీన్ల కోసం ఇప్పుడు చేస్తున్న కృషి మాత్రం మెచ్చదగిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: