
రోజాపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, మహిళా నాయకురాలిని వేధించిందని ప్రచారం చేస్తూ, మహిళా ఓటర్లలో సానుభూతి సృష్టించుకోవాలనే యత్నం వైసీపీ వ్యూహంలో భాగమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా, ఈ వివాదం తమకు నేరుగా మైలేజ్ ఇస్తుందా లేదా అనేది పక్కనబెడితే, ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో భావోద్వేగాలను రేకెత్తించవచ్చని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఈ విషయంపై కూటమిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం, ముఖ్యంగా సీమ ప్రాంతానికి చెందిన మహిళా నాయకులు, రోజాపై వ్యక్తిగత స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని, ఆమె అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. అయితే, కూటమిలోని మరో కీలక పార్టీ మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది.
రోజా సినీ నేపథ్యం ఉన్న ప్రజాదరణ కలిగిన వ్యక్తి కావడంతో, ఆమెపై తొందరపడి చర్యలు తీసుకోవడం ప్రతికూల ప్రభావం కలిగించవచ్చని వారు భావిస్తున్నారు. అదే సమయంలో, కేవలం 40 కోట్ల రూపాయల ఆరోపణలకే అరెస్టు చేస్తే, అవసరంలేని వివాదం రేగే అవకాశం ఉందని కొందరు కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, ప్రస్తుతానికి పరిస్థితిని పరిశీలించి, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరోవైపు, టీడీపీలో కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ కేసును తక్షణమే ముగించకుండా, రోజాను రాజకీయంగా కంట్రోల్ చేసే విధంగా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే రోజా సైలెంట్ మోడ్లోకి వెళ్లారని, ఈ సమయంలో ఆమెపై చర్యలు తీసుకోవడం కన్నా, కొంతకాలం ఆమెను వ్యూహాత్మకంగా కంట్రోల్ చేయడం మంచిదని భావిస్తున్నారు. ఫైనల్గా రోజాపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ దిశలో అడుగులు వేస్తుందో.. అలాగే వైసీపీ ఈ అంశాన్ని ఎలా రాజకీయంగా మలుస్తుందో చూడాలి.