బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వరి ఇటీవల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె నిజంగా పార్టీపై అలకబూనారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబంలో జరిగిన విషాదం కారణంగా వ్యక్తిగత విషయాల్లోనే ఆమె దృష్టి సారించారని చెబుతున్నా అసలు కారణం మాత్రం బీజేపీ వ్యవహారాలపైనే ఉన్న అసంతృప్తేనని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పురందేశ్వరిని పక్కన పెట్టిన తర్వాత, కేంద్రంలోనూ పెద్ద ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆమెను నిరాశకు గురిచేసిందని అంటున్నారు. మహిళా ప్రాథినిత్యం పేరిట ఇచ్చిన ఒక చిన్నపాటి పదవి ఆమె రాజకీయంగా యూజ్ లేకుండా పోయింద‌న్న భావ‌న ఆమెలో ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఎంపీగా ఉన్న గుర్తింపు ఉన్నా పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదనే భావన ఏర్పడిందని చెబుతున్నారు.


ఈ క్రమంలోనే, ఇప్పుడు కేంద్రంలో లభించే నామినేటెడ్ పదవుల కోసం పురందేశ్వరి బలంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని, జాతీయ స్థాయిలో ఒక కీలక పదవి సాధించాలనే ఆలోచనలో ఆమె ఉన్నారట‌. ముఖ్యంగా, జాతీయ పార్టీ అధ్యక్షురాలి రేసులోనూ పురందేశ్వరి పేరు గతంలో వినిపించింది. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆ స్థాయి మహిళా నాయకత్వానికి పురందేశ్వరి కూడా లైన్‌లో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ ఆ చర్చ పుంజుకుంది. వ‌చ్చే నెలలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి ఆ రేసులో ఉంటారని అనుకుంటున్నారు.


ఆ పదవి అందకపోతే, కనీసం ఒక నామినేటెడ్ పదవైనా దక్కించుకోవాలని పురందేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో సమాచారం. పురందేశ్వరి అలకకు ప్రధాన కారణం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆమెకు మద్దతుగా నిలవకపోవడమే అని పరిశీలకుల అభిప్రాయం. తాను కేంద్రంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా, రాష్ట్ర స్థాయి నుంచి బలమైన సిఫార్సు లేకపోవడం ఆమెకు పెద్ద ఆటంకంగా మారింది. అయినప్పటికీ, జాతీయ స్థాయిలో బలమైన సంబంధాలున్న పురందేశ్వరి ఏదో ఒక పదవిని సాధించే అవకాశం ఉందని అంటున్నారు. చివరికి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: