కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో షాకుల పరంపర కొనసాగుతోంది. చిదంబరానికి ముం దస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం.. ఢిల్లీ కోర్టు తీర్పును సవాలు చేసే పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ దృష్టికి తీసుకెళ్లి.. అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఆయన ఏ క్షణమైనా అరెస్టు కావొచ్చని ప్రచారం జరుగుతోంది. చిదంబరం కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరెట్ (ఈడీ) అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. చిదంబరానికి లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో చిదంబరం విదేశాలకు వెళ్లకుండా ఈడీ చర్యలు తీసుకుంది. ఐఎన్ఎక్స్ అవకతవకల కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్ కేసును ఓ ప్రత్యేకమైన మనీ లాండరింగ్ (హవాలా) కేసుగా అభివర్ణించింది. సమర్థవంతమైన విచారణ జరుగడానికి నిర్బంధ విచారణ అవసరమని జస్టిస్ సునీల్ గౌర్ పేర్కొన్నారు.
మూడు రోజులపాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లగా ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. మంగళవారం రెండుసార్లు చిదంబరం ఇంటికి వెళ్లారు. రాత్రి చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, చిదంబరం తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు.
చిదంబరం పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రస్తావించారు. తీర్పు ఇవ్వడానికి నిరాకరించారు జస్టిస్ రమణ.. దీనిపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సీజేఐ ముందు చిదంబరం పిటిషన్ ప్రస్తావనకు వచ్చింది. అయోధ్య కేసులో చీఫ్ జస్టిస్ బిజీగా ఉండటంతో తీర్పు వెలువడలేదు.