ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఏప్రిల్ 22 వ తేదీన తమిళ నటుడు విష్ణు విశాల్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. బంధుమిత్రుల సమక్షంలో హైదరాబాద్ లో ఏప్రిల్ 22న తాను, విష్ణు పెళ్లి చేసుకోబోతున్నామని గుత్తాజ్వాల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకోబోతున్నామనే శుభవార్త మీకు తెలియజేయడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది.. మాపై ప్రేమ ఆప్యాయత కురిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..మేము మీ అందరి ఆశీస్సులను కోరుకుంటున్నాము" అని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తన పెళ్లి కార్డు లో పేర్కొన్నారు.



నిజానికి వీళ్లిద్దరూ గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటారు. గతేడాది కరోనా లాక్ డౌన్ కాలం లో హైదరాబాద్ లో వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వారి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గుత్తా జ్వాల ధరించిన వెడ్డింగ్ రింగ్ ఫోటోలు అంతర్జాలం లో హల్ చల్ చేశాయి. ఐతే ఇటీవల నటుడు విష్ణు విశాల్ తమ పెళ్లికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కాగా నేడు ఈ జంట మ్యారేజ్ డేట్ వెల్లడించారు.



అయితే కొన్ని వారాల క్రితం విష్ణు విశాల్ తమ పెళ్లికి సంబంధించిన వివరాలను మీడియాకి వెల్లడిస్తూ... "మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మేము బాధ్యతగా వ్యవహరించాలని అనుకుంటున్నాము. అందుకే మా పెళ్లి వేడుకను కేవలం బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటున్నాము. భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయదలచుకున్నాం కానీ కరోనా సమయంలో మా ఆలోచనను విరమించుకున్నాము," అని ఆయన అన్నారు.


"ప్రస్తుతం మోహన్ దాస్ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నాను. షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే ఏప్రిల్ 19 లేదా 20 వ తేదీన హైదరాబాద్ చేరుకుంటాను. ఆ తేదీలలో మా నివాసం లో జరిగే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటాను. నా కాబోయే భార్య గుత్తా జ్వాల ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. నేను వెడ్డింగ్ విన్యూ కి చేరుకొని తాళి కట్టడమే తరువాయి" అని నవ్వుతూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: